ప్రత్యర్థి అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకునేలా చేసిన బీజేపీ..!!
అహ్మదాబాద్: గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ అన్ని పార్టీలు కూడా తమ ప్రచార జోరును పెంచుకుంటోన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడం వల్ల- అందరి దృష్టీ ఈ ఎన్నికలపైనే నిలిచింది. ఫలితాలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠభరితంగా మారింది. రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ప్రభావం ఎంతమేర ఉందనేది ఈ ఎన్నికలు స్పష్టం చేయనున్నాయి.
ప్రధాని మోదీకి చేతికి సుత్తిని అందించిన ఆ దేశాధ్యక్షుడు..!!
గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1వ తేదీన 89 సీట్లు, 5వ తేదీన మిగిలిన 93 స్థానాలకు పోలింగ్ను షెడ్యూల్ చేసింది. మొత్తం 4,90,89,765 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఎన్నికలు ముగిసిన హిమాచల్ ప్రదేశ్తో కలిపి అదే నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.
కాగా- ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సూరత్ తూర్పు నియోజకవర్గానికి అభ్యర్థి కంచన్ జరీవాలా తన నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం కంచన్ జరీవాలాను బీజేపీ నాయకులు కిడ్నాప్ చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ప్రత్యక్షం అయ్యారు. నేరుగా రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లి- తన నామినేషన్ పత్రాలను వెనక్కి తీసుకున్నారు.
ఈ ఘటనతో సూరత్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కంచన్ జరీవాలా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చిన విషయాన్ని తెలిసిన వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఆయనను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. రిటర్నింగ్ అధికారి ఛాంబర్లో సైతం తోపులాట చోటు చేసుకుంది. రిటర్నింగ్ అధికారి చేతుల్లో నుంచి నామినేషన్ పత్రాలను వెనక్కి తీసుకునే సమయంలో కంచన్ను వెనక్కి లాగారు. ఛాంబర్ నుంచి బయటికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అది సాధ్యం కాలేదు.
తమ అభ్యర్థి నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్న విషయం తెలిసిన వెంటనే మనీష్ సిసోడియా- కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లారు. బయట ఆందోళనకు దిగారు. తమ అభ్యర్థిని ప్రాణాలు తీస్తామంటూ బీజేపీ నాయకులు భయపెట్టారని, బలవంతంగా నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకునేలా చేశారని ఆరోపించారు. దీనికి కారకులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పార్టీ నాయకులతో కలిసి ఈసీ కార్యాలయం వద్ద బైఠాయించారు. నినాదాలు చేశారు.