కేజ్రీవాల్కు షాక్: ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి 18వేల ఓట్ల తేడాతో పరాజయం
గాంధీనగర్: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చుక్కెదురైంది. పంజాబ్ తర్వాత గుజరాత్ రాష్ట్రంలో విజయభావుట ఎగరవేస్తామన్న ఆమ్ ఆద్మీ పార్టీ.. కేవలం ఐదు సీట్లకే పరిమితమైంది. అంతేగాక, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదన్ గాధ్వి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖంభాలియా స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
18,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. తొలి రౌండ్లలో కాంగ్రెస్ ప్రస్తుత ఎమ్మెల్యే విక్రమ్ మాడమ్పై గాధ్వి ఆధిక్యంలో ఉండగా, బీజేపీకి చెందిన ములుభాయ్ బేరా మూడో స్థానంలో వెనుకంజలో ఉన్నారు. కానీ తర్వాత జరిగిన ఓట్ల లెక్కింపులో బేరా తన ప్రత్యర్థులను అధిగమించి సునాయాసంగా విజయం సాధించారు.
2007, 2012లో బీజేపీ ఈ స్థానాన్ని గెలుచుకుంది. అయితే 2014లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది. 2017లో కాంగ్రెస్ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంది.
ఖంభాలియా స్థానం నుంచి పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులు కాంగ్రెస్ నుంచి అహిర్ విక్రమ్భాయ్ అర్జన్భాయ్ మాదం, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి సోలంకి గోవింద్ హమీర్భాయ్, ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నుంచి బుఖారీ యాకుబ్ మహ్మద్ హుషేన్, గుజరాత్ నవ నిర్మాణ సేన నుంచి చెటారియా లఖుభాయ్ లగ్ధీర్భాయ్ ఉన్నారు. ఈ స్థానం నుంచి ఐదుగురు స్వతంత్రులు కూడా పోటీలో ఉన్నారు.
సౌరాష్ట్ర ప్రాంతంలోని ఈ నియోజకవర్గం నుంచి ఆప్ తన ముఖ్యమంత్రి ముఖమైన గధ్విని పోటీకి దింపిన తర్వాత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో ఖంభాలియా హై-ప్రొఫైల్ స్థానాల్లో ఒకటిగా అవతరించింది.
మాజీ టీవీ న్యూస్ యాంకర్ గాధ్వి ఖంభాలియాలో పుట్టి పెరిగారు. కానీ అహిర్-ఆధిక్యత ఉన్న ఈ సీటులో సామాజిక సమీకరణాలు బహుశా అతనికి అనుకూలంగా లేవు. ఎందుకంటే ఈ ప్రాంతంలో అతని స్వంత గాధ్వి సంఘం సంఖ్యాపరంగా పెద్దగా లేదు. కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రికార్డు స్థాయిలో సీట్లు గెలుచుకోవడం ద్వారా గుజరాత్ను నిలబెట్టుకుంది.
కాగా, గుజరాత్ రాష్ట్రానికి డిసెంబర్ 1, 5 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తొలి దశలో 89 స్థానాలకు, రెండో దశలో 93 స్థానాలకు ఎన్నికల నిర్వహించారు. గురువారం ఫలితాలు వెలుడ్డాయి. బీజేపీ 156 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 17, ఆమ్ ఆద్మీ పార్టీ 5 సీట్లకు పరిమితమయ్యాయి.
ఈ ఎన్నికల్లో 64.33 శాతం ఓటింగ్ నమోదైంది, ఇది 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే దాదాపు 4 శాతం తక్కువ. 4.9 కోట్ల మంది నమోదైన ఓటర్లలో, 2022 ఎన్నికల్లో కేవలం 3.16 కోట్ల మంది మాత్రమే ఓటు వేశారు.