ఆగండి, గుజరాత్ తీర్పు జబర్దస్త్: రాహుల్ గాంధీ ధీమా
గాంధీనగర్ : గుజరాత్ ఎన్నికల ఫలితాలపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని కాంగ్రెస్ పార్టీ భావి అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మంగళవారం రోడ్ షోను రద్దు చేసుకున్న ఆయన అహ్మదాబాద్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
వచ్చే సోమవారం గుజరాత్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను లెక్కించిన తర్వాత జబర్దస్త్ ఫలితాలు వస్తాయని అన్నారు. గత మూడు నెలలుగా తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై, తాను ఆలయాలను సందర్శించడంపై బీజేపీ చేసిన విమర్శలకు ఆయన జవాబిచ్చారు.
తాను ఆలయాల సందర్శనకు వెళ్లిన ప్రతిసారి గుజరాత్ బాగుండాలని, గుజరాత్కు బంగారు భవిష్యత్ ఉండాలని కోరుతున్నానని ఆయన చెప్పారు తన ఆలయాల సందర్శన అంశం ఒక్క గుజరాత్కు, ఎన్నికలకు ముడిపెట్టే అంశం మాత్రమే కాదని ఆయన చెప్పారు.
గుజరాత్ ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఆయన గుజరాత్ రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మూడు నెలలు గుజరాత్ ప్రజలు తనపై అమితమైనప్రేమ కురిపించారని, ఇది తన జీవితంలో మర్చిపోలేనని ఆయన అన్నారు.
తాను ఎక్కడికి వెళ్లినా కూడా సాదరంగా ఆదరించారని, మూంగ్ఫాలీ, ఢోక్లా, థెప్లావంటివి ఇచ్చి తనను ఆశ్చర్య పరిచారని ఆయన చెప్పారు. మీకు ఎప్పుడు నా అవసరం పడిన ఒక్క ఫోన్ చేయండని ఆయన సూచించారు.
జీఎస్టీని ఆయన మరోసారి గబ్బర్ సింగ్ ట్యాక్స్గా అభివర్ణించారు. గుజరాత్లో అభివృద్ధి అంతా ఒక వైపే ఉందని అన్నారు.