దిక్కుమాలిన, సిగ్గులేని ప్రభుత్వం: సిద్ధరామయ్యతో వేదిక పంచుకోనంటూ ఏకేసిన దేవెగౌడ
బెంగళూరు: మాజీ ప్రధాని, జనతా దల్-సెక్యూలర్(జేడీ-ఎస్) అగ్రనేత హెచ్డీ దేవెగౌడ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎంతో వేదికను పంచుకునేందుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇంత దిక్కుమాలిన పాలన తాను ఎప్పుడూ చూడలేదని సీఎం సిద్ధరామయ్యపై తీవ్రంగా విమర్శించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో దేవెగౌడ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తేల్చేసిన దేవెగౌడ్
ఫిబ్రవరి 7న శ్రావణబెళగొళలో జరగనున్న మహవీర్ మహా మస్తకాభిషేకం కార్యక్రమం సందర్భంగా సీఎం సిద్ధరామయ్యతోపాటు దేవెగౌడ్ కూడా పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాను సిద్ధరామయ్యతో వేదిక పంచుకునేదే లేదని ఆయన తేల్చి చెప్పారు.
కలెక్టర్ బదిలీపై ఆగ్రహం
హాసన్ కలెక్టర్ రోహిణి బదిలీ చేయడంపై దేవెగౌడ.. సిద్ధరామయ్య ప్రభుత్వంపై ఇప్పటికే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘నా జీవితంలో ఇంత దిక్కుమాలిన ప్రభుత్వాన్ని చూడలేదు. ఫిబ్రవరి 7న హాసన్కు రాష్ట్రపతి వస్తున్న నేపథ్యంలో హాసన్ కలెక్టర్ను బదిలీ చేయడం ఏంటి? ఏ ప్రయోగం ఆశిస్తున్నారు? జిల్లా ప్రతినిధులకు గౌరవం ఇస్తాను కానీ, సిద్ధరామయ్యతో మాత్రం వేదికను పంచుకోను. ఈ దిగజారుడు ప్రభుత్వాధినేతతో వేదికను పంచుకోవద్దని రాష్ట్రపతి కూడా లేఖ రాస్తా' అని దేవేగౌడ స్పష్టం చేశారు.
సిగ్గులేని, దిక్కుమాలిన ప్రభుత్వం
అంతేగాక, సిద్ధరామయ్యది ఓ సిగ్గులేని ప్రభుత్వమని, అవినీతిలో కూరుకుపోయిందని దేవెగౌడ తీవ్రంగా విమర్శించారు. కాగా, త్వరలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జేడీఎస్ పొత్తు పెట్టుకుందనే వార్తలు వచ్చిన మరుసటి రోజే.. దేవెగౌడ తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై విరుచుకుపడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
పెద్ద ఎత్తున నిరసన
కలెక్టర్ రోహిణి సింధూరిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జనవరి 25న హాసన్లో జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవేగౌడ నేతృత్వంలో నిరసనలు చేయనున్నట్లు హాసన్ ఎమ్మెల్యే రేవణ్ణ తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలను ఆమె అడ్డుకుంటారనే కారణంగా సీఎం సిద్ధరామయ్య ఆమెను బదిలీ చేశారని ఆరోపించారు. ఇందులో మంత్రి మంజు, జిల్లా కాంగ్రెస్ నేతల ఒత్తిడి ఉందని విమర్శించారు.