చారిత్రాత్మక తీర్పు: హజీ అలీ దర్గాలోకి మహిళలకు అనుమతి
ముంబై: ముంబైలోని ప్రఖ్యాత హజీ అలీ దర్గాలోకి మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ బాంబై హైకోర్టు శుక్రవారం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. దర్గాలోకి మహిళలు ప్రవేశించకుండా నిషేధం విధించడం వారి ప్రాథమిక హక్కులను భంగం కలిగించినట్లేనని కోర్టు తన తీర్పులో వెల్లడించింది.
పురుషులతో సమానంగా మహిళలు కూడా దర్గాలోనికి వెళ్లొచ్చని, ఈ క్రమంలో మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే... ఎంతో చరిత్ర కలిగిన ఈ దర్గాలోకి మహిళలు రాకూడదంటూ హజీ అలీ దర్గా ట్రస్ట్ 2012లో నిషేధం విధించింది.
అప్పట్లో దీనిపై పిల్ దాఖలైంది. లింగభేదాన్ని ఖండిస్తూ భూమాతా బ్రిగేడ్ నాయకురాలు తృప్తీ దేశాయ్ ఇటీవలే దేశంలో మహిళలకు అనుమతిలేని పలు ఆలయాల్లోకి ప్రవేశించి పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆమె చేస్తోన్న ఉద్యమ ఫలితంగా శనిసింగనాపూర్, త్రయంబకేశ్వర్ ఆలయాల్లోకి మహిళలు ప్రవేశించారు.
దర్గాలోనికి కూడా మహిళలను అనుతించాలంటూ ఆమె ఉద్యమం చేపట్టారు. ఈ క్రమంలో దర్గాలోకి మహిళలపై ప్రవేశంపై దాఖలైన పిటిషన్ను విచారించిన బాంబే హైకోర్టు దర్గాలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఇదిలా ఉంటే బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై హజీ అలీ దర్గా ట్రస్ట్ సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు అమలును ఆరు వారాల పాటు నిలుపుదల చేశారు.