సగం చిన్నారుల శరీరాల్లో కోవిడ్ యాంటీబాడీలు-ముంబై సీరో సర్వే రిపోర్ట్
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతోంది. అదే సమయంలో ధర్డ్ వేవ్ భయాలూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ధర్డ్ వేవ్ ప్రభావం చిన్నారులపై ఎక్కువగా ఉంటుుందన్న అంచనాలతో తల్లితండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇదే సమయంలో ముంబైలో తాజాగా అధికారులు చేపట్టిన సీరో సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలుగుచూశాయి.
ముంబైలో కోవిడ్ తాజా పరిస్ధితి తెలుసుకునేందుకు బృహన్ ముంబై కార్పోరేషన్ తాజాగా సీరో సర్వే నిర్వహించింది. ఇందులో ఎంపిక చేసిన వారి శరీరాల్లో కరోనా రోగ నిరోధకాల స్ధాయి ఎంత మేరకు ఉందో నిర్ధారించారు. ఈ సర్వేలో ముంబైలోని చిన్నారుల్లో సగం మంది శరీరాల్లో కోవిడ్ రోగనిరోధకాలు అభివృద్ధి చెందినట్లు బీఎంసీ అధికారులు గుర్తించారు. దీంతో వీరిలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు కూడా తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 6 నుంచి 18 ఏళ్ల మధ్య పిల్లలపై నిర్వహించిన సీరో సర్వేలో ఈ ఫలితాలు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు.
ఈ సర్వేలో ముంబైలోని 10 వేల మంది చిన్నారుల శరీరాల నుంచి శాంపిల్స్ సేకరించారు. ర్యాపిడ్ విధానంలో ఎంపిక చేసిన పిల్లల నుంచి ఈ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ కు పంపారు. వీరిలో సగం మందికి పైగా చిన్నారుల శరీరాల్లో రోగనిరోధకాలు అభివృద్ధి చెందినట్లు తేలడంతో ప్రభుత్వంతో పాటు తల్లితండ్రులు కూడా ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ సీరో సర్వేలో పాల్గొన్న చిన్నారుల్లో సగం మంది కరోనా బారిన పడినట్లు అధికారులు తేల్చారు. అలాగే ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 10 నుంచి 14 సంవత్సరాల మధ్య పిల్లల్లో 53.43 శాతం సీరో పాజిటివిటీ రేటు ఉన్నట్లు నిర్ధారణ అయింది.