దగ్గుమందు తయారీలో 12 లోపాలు.. మైడెన్ ఫార్మాకు షోకాజ్ నోటీసుల జారీ
దగ్గు, జలుబు నివారణకు సిరప్లు వినియోగించడంతో గాంబియాలో 66 మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన అంతర్జాతీయస్థాయిలో తీవ్ర సంచలనం సృష్టించింది. హర్యానాలోని మైడెన్ ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తిచేసిన నాలుగు సిరప్ల కారణంగానే సెప్టెంబరులో ఈ మరణాలు సంభవించాయి. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

నవంబరు 14లోగా సమాధానమివ్వాలి
నిబంధనలు ఉల్లంఘించినందుకు ఇవి తయారు చేసిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్కు హర్యానా ఔషధ నియంత్రణ సంస్థ షోకాజ్ నోటీసులు జారీచేసింది. తయారీ లైసెన్స్ ఎందుకు రద్దుచేయకూడదో చెప్పాలని పేర్కొంది. దగ్గు మందు తయారీ, పరీక్షకు సంబంధించిన వివరాలను లాగ్ బుక్ లో నమోదు చేయలేదు. లాగ్ బుక్సే నిర్వహించడంలేదని వెల్లడైంది. నోటీసులకు కంపెనీ నవంబరు 14వ తేదీలోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.

గతంలోనే మన రాష్ట్రాలు నాణ్యతపై అభ్యంతరం తెలిపాయి
సార్బిటాల్ సొల్యూషన్, ప్రొపైలిన్ గ్లైకాల్, సోడియం మిథైల్పరాబెన్ బ్యాచ్ నంబర్ల వివరాలు లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. తయారీ ప్రక్రియలో పరీక్షలకు సంబంధించిన వివరాలు కూడా సంస్థ ఇవ్వలేదు. గతంలో కూడా మనదేశంలోని నాలుగు రాష్ట్రాలు నాణ్యత లేదంటూ ఈ మందులపై అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. 2011లో మైడెన్ పై వియత్నాం నిషేధం విధించింది.

చిన్నారుల్లో దెబ్బతిన్న కిడ్నీలు
కొఫెక్స్మలిన్ బేబీ కాఫ్ సిరప్, ప్రొమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, మాకోఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ల ఉత్పత్తి నిలిపివేయాలని హర్యానా అధికారులు ఆదేశించారు. గాంబియాలో ఇవి వాడిన చిన్నారులు మరణించడంతోపాటు మరికొందరికి కిడ్నీలు దెబ్బతిన్నాయి. తక్షణమే వీటిని నిలిపివేయాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశించడంతోపాటు ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. ఈ సిరప్స్ లో ప్రమాదకర స్థాయుల్లో డైథిలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నాయి. మైడెన్ ఫార్మా తయారుచేసిన ఈ సరిప్స్ భారత్ లో విక్రయించడానికి, మార్కెటింగ్ చేయడానికి వీల్లేదని, ఇవి ఎగుమతికే అనుమతి పొందాయని హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ఈ ఔషధాలను కోల్ కతాలోని సెంట్రల్ డ్రగ్ ల్యాబ్ కు పంపించామని, తనిఖీల్లో 12 లోపాలు బయటపడటంతో ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications