గ్యాంగ్రేప్ మొదలుకుని అర్ధరాత్రి దౌర్జన్యంగా దహన సంస్కారం: ఆ కుటుంబానికి అడుగడుగునా అన్యాయమే
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని హత్రాస్లో నలుగురు కామాంధుల చేతుల్లో అత్యంత దారుణంగా అత్యాచారానికి గురైన దళిత యువతి కుటుంబానికి చివరికి.. దహన సంస్కారంలోనూ అన్యాయమే ఎదురైంది. దేశ రాజధానిలోని సఫ్దార్జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన అనంతరం అత్యాచార బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు తామే స్వయంగా దహన సంస్కారాన్ని నిర్వహించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుమార్తె మృతదేహాన్ని పోలీసులు తమకు అప్పగించలేదని, కనీసం అంత్యక్రియల్లోనూ పాల్గొనకుండా అడ్డుకున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

రాజకీయ దుమారానికి..
ఈ ఉదంతం మొత్తం.. రాజకీయ రంగును పులుముకుంటోంది. ఉత్తర ప్రదేశ్లో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీని రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని వినియోగించుకుంటోంది. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యుద్ధ ప్రాతిపదికన స్పందించారు. దర్యాప్తు కోసం ప్రత్యేకంగా సిట్ను ఏర్పాటు చేశారు.

అసలేం జరిగింది?
ఉత్తర ప్రదేశ్లోని హత్రాస్లో ఈ నెల 14వ తేదీన 19 సంవత్సరాల దళిత యువతి అత్యాచారానికి గురయ్యారు. ఆమె నివసించే ప్రాంతానికే చెందిన నలుగురు యువకులు ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టారు. తల్లి, సోదరుడితో కలిసి పొలం పనులకు వెళ్లిన ఆ యువతిని ఆమె ధరించిన చున్నీతోనే మెడకు ఉరిలా వేసి పొలం నుంచి లాక్కెళ్లారు. అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో ప్రతిఘటించడానికి ప్రయత్నించగా.. తీవ్రంగా కొట్టారు. ఆమె శరీరం మీద పలుచోట్ల గాయాలు అయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో స్పహ కోల్పోయిన బాధితురాలిని సంఘటనా స్థలంలోనే వదిలేసి పరారయ్యారు.

13 రోజుల తరువాత వెలుగులోకి..
తమ కుమార్తెను ఆ స్థితిలో చూసిన తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఆమెను అలీగఢ్ ఆసుపత్రికి తరలించారు. అత్యాచార ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. అత్యాచారం 14వ తేదీన జరగ్గా.. ఈ నెల 26వ తేదీన ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిందంటే.. ఆ అమానవీయ ఉదంతాన్ని అణగదొక్కడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

నలుగురి అరెస్టు..
అలీగఢ్ ఆసుపత్రిలో బాధిత యువతి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం దేశ రాజధానిలో సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మంగళవారం మరణించారు. ఈ ఘటనలో హత్రాస్కే చెందిన సందీప్, రాము, లవ్ కుష్, రవి అనే నలుగురిని పోలీసులు అనుమానితులుగా అరెస్టు చేశారు. నిందితులు అగ్రకులానికి చెందిన వారని, అందుకే ఈ కేసును తొక్కిపెట్టడానికి ప్రయత్నాలు సాగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

అంత్యక్రియల్లోనూ అన్యాయమే..
అత్యాచార బాధితురాలి మృతదేహానికి పోలీసులు అర్ధరాత్రి హుటాహుటిన అంత్యక్రియలను నిర్వహించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సఫ్దర్ జంగ్ ఆసుపత్రి నుంచి తీసుకొచ్చిన మృతదేహాన్ని అర్ధరాత్రి దాటిన తరువాత 2:30 గంటల సమయంలో హత్రాస్లో అంత్యక్రియలను నిర్వహించారు పోలీసులు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను దగ్గరికి కూడా రానివ్వలేదు. కనీసం కడసారి చూపునకు కూడా నోచుకోనివ్వలేదు. హడావుడిగా పోలీసులు దహన సంస్కారాలను చేపట్టడాన్ని స్థానికులు అడ్డుపడే ప్రయత్నం చేశారు. దీనితో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ.. తాము చేయాల్సింది చేసేశారు పోలీసులు. అంత్యక్రియలను కూడా నిర్వహించనివ్వకుండా అడ్డుకున్నారంటూ పోలీసులపై మండిపడుతున్నారు కుటుంబ సభ్యులు.

ముఖ్యమంత్రి రాజీనామా చేయాలంటూ..
ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ యోగి ఆదిత్యనాథ్ వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తర ప్రదేశ్ పార్టీ ఇన్ఛార్జి ప్రియాంకా గాంధీ సహా పలువురు విపక్ష పార్టీల నేతలు యోగి సర్కార్పై విరుచుకుపడుతున్నారు. శాంతిభద్రతలు మటుమాయం అయ్యాయని, అనేకమంది ఆడపిల్లలు కామాంధుల చేతుల్లో బలి అవుతున్నారని విమర్శిస్తున్నారు. ఇంకెంతమందిని బలి తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications