‘అవార్డు వాపసీ’ ఒక రాజకీయ ప్రేరేపితం, రుజువులూ ఉన్నాయి: మాజీ సాహిత్య అకాడమీ చీఫ్
న్యూఢిల్లీ: దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2015లో జరిగిన 'అవార్డ్ వాపసీ' అనేది రాజకీయ ప్రేరేపిత ఉద్యమమేనని సాహిత్య అకాడమీ మాజీ అధిపతి విశ్వనాథ్ ప్రసాత్ తివారీ అన్నారు. ఇందుకు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ 50మంది రచయితలు తమ అవార్డులను ఆనాడు తిరిగిచ్చేసిన విషయం తెలిసిందే. రాజకీయ ప్రేరేపితంతో మార్కిస్టు రచయితలు, హిందీ కవి అశోక్ వాజపేయి కలిసి బీహార్ ఎన్నికల నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంపై బురద జల్లేందుకే ఈ కార్యక్రమం చేపట్టారని అన్నారు.
అయితే, వాజపేయి తివారీ ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. లిటరరీ మేగజైన్ దత్సవేజ్లో తివారీ రాసిన 10పేజీల ఆర్టికల్ పబ్లిష్ అయ్యింది. ఈ మేరకు ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం.. దేశంలో నెలకొన్న పరిస్థితులను ఆసరాగా చేసుకుని పలువరు రచయితలు ఒకరికొకరు తెలియకున్నా అవార్డులను వాపస్ చేశారని తివారీ వ్యాఖ్యానించారు.
'ది ట్రూట్ ఆఫ్ అవార్డ్ వాపసీ అండ్ హిపోక్రసీ బిహైండ్ ఇట్' అనే శీర్షికతో తివారీ తన కథనాన్ని రాశారు. ప్రధాని నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా ద్వేషించే మూడు గ్రూపుల రచయితలు నాలుగు నెలలపాటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. మరికొంతమంది వారి స్నేహితులు, మరో 25మంది రచయితలు వ్యక్తిగత ప్రచారం కోసం కేంద్రంపై బురదజల్లేందుకే ఈ కార్యక్రమం చేపట్టారని అన్నారు.
అవార్డు వాపసీ అనే కార్యక్రమం అప్పటికప్పుడు చేసింది కాదని, అది ఒక ప్లాన్ ప్రకారం చేసిందని తివారీ చెప్పారు. అందుకు తన వద్ద తగిన ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రామన్ని ఐదుగురు రచయితలు తమ భుజాలపై ఎత్తుకున్నారని చెప్పారు. వీరు నరేంద్ర మోడీ ప్రధాని కావడానికి ముందు నుంచే ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై వ్యక్తిగత ద్వేషంతో అశోక్ వాజపేయి అవార్డు వాపసీ కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. కొంతమంది రచయితలు తమపై ఒత్తిడి ఉందని అందుకే అవార్డు వాపసీలో పాల్గొంటున్నామని చెప్పారని తెలిపారు.
రచయిత నయనతార సెహగల్ కూడా తన షోలా ద్వారా వ్యతిరేకతను వ్యక్తం చేశారు. అవార్డు వాపస్ చేసి ఆ కార్యక్రమంలో ఆమె కూడా ముందు నడిచారు. నయనతార ఎమర్జెన్సీ సమయంలోనూ వ్యతిరేకించారని చెప్పుకుంటున్నారని.. కానీ, ఆ తర్వాత కొంత కాలానికి సాహిత్య అకాడమీ సంస్థ నుంచి ఆమె ఎందుకు అవార్డు తీసుకున్నారని ప్రశ్నించారు.
'స్వేచ్ఛ అనేది పౌరులకు పెద్ద బలం. కానీ, ఇది ప్రమాకరమైన ఆయుధం కూడా. గుర్తింపు పొందిన మేధావులు అపనమ్మకంతో అవార్డు వాపసీ కార్యక్రమం చేపట్టారు. ఇది ఒక రాజకీయ ప్రేరేపితమైన కార్యక్రమం మాత్రమే' అని తివారీ పేర్కొన్నారు.
అవార్డ్ వాపసీ కార్యక్రమంలో పాల్గొన్న చాలా మంది రచయితలు వీరేంద్ర యాదవ్, అఖిలేష్, కాశీనాథ్ సింగ్ తదితరులు బీహార్ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ కూటమి గెలుపొందిన తర్వాత లక్నోలోని కథకరమ్ కార్యక్రమంలో సంబరాలు కూడా చేసుకున్నారని తెలిపారు.
''తాను అవార్డు వాపస్ చేయనని చెప్పిన సింగ్.. రెండ్రోజుల తర్వాత 'అసహనం పెరిగిపోతోంది' అనే అంశంపై జరిగిన ఇంటర్వ్యూలో సింగ్ పాల్గొన్నారు. యూపీ ప్రభుత్వం ఇచ్చిన అవార్డును ఆయన వెనక్కివ్వలేదు. యూపీలోని దాద్రిలోనే అక్లక్ పై మూక దాడి జరగడం గమనార్హం. ఎమర్జెన్సీ సమయంలో ఎంతో సంతోషంగా అవార్డులు తీసుకున్న కొందరు రచయితలు.. 2015లో అసహనం అంటూ దొంగ ఏడ్పులు ఏడ్చారు.' అని తివారీ మండిపడ్డారు. కమ్యూనిస్టు రచయితలే.. అకాడమీ, ఇతర రచయితల మధ్య చిచ్చుపెట్టారని ధ్వజమెత్తారు.
తదుపరి సంవత్సరం జులై, 2016లో అవార్డు వాపసీ కార్యక్రమంలో పాల్గొన్న రచయితలే జేడీయూ నేత కేసీ త్యాగి ఇంట్లో నితీష్ కుమార్తో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. మొదట్నుంచి ఉన్న వ్యతిరేకతను కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక అసహనం పేరుతో మరింత వ్యక్తపరిచారని వారిపై మండిపడ్డారు. అది వారి వ్యక్తిగత అసహనం మాత్రమేనని అన్నారు.
'మలయాళం రచయిత కే సచ్ఛిదానందన్ అతడ్ని 'అహంకారి' అని అన్నారు. అతడు నాకు పంపిన ఈమెయిల్ను అనివార్య కారణాల వల్ల నేను చదవలేకపోయాను. ఆ తర్వాత నాకు కాల్ చేశారు. అతని మాటలు నన్నేంతో బాధించాయి' అని తివారీ చెప్పారు.
కాగా, అశోక్ వాజపేయి తివారీ ఆరోపణలను ఖండించారు. ఆయన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని అన్నారు. తాము వ్యక్తిగత ఏజెండాతో చేయలేదని అన్నారు. నయనతార సెహగల్ అవార్డు తిరిగిచ్చేయడంతో తాను కూడా ఇచ్చానని తెలిపారు. అప్పుడు దేశ పరిస్థితులు అలా ఉన్నాయన్నారు. తాను మొదటి 15రోజులు దేశంలోనే లేనని, ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్నని తెలిపారు. ఇదంత కలిసి చేసిన పని అని అన్నారు.
అయితే తివారీ మాత్రం తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛా విజేతలమని చెప్పుకుంటున్న రచయితల బండారం బయటపెడతానని అన్నారు. అకాడమీ అవార్డులు ఎప్పుడు పడితే అప్పుడు వాపస్ చేయడం, తిరిగి తీసుకోవడం కుదరదని అన్నారు. అశోక్ వాజపేయి వాస్తవాలను దాచేసి మాట్లాడుతున్నారని తివారీ మండిపడ్డారు.
నాలుగేళ్ల క్రితం అశోక్ వాజపేయికి చెందిన రాజా ఫౌండేషన్ కార్యక్రమానికి సహకరించలేదనే కోపంతోనే అకాడమీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కన్నడ రచయిత ఎంఎం కుల్బర్గికి నివాళులర్పించే కార్యక్రమంలోనూ రాజకీయం చేశారని మండిపడ్డారు. కుల్బర్గితోపాటు ఇతర రచయితల హత్యలను తాము ఖండించామని, ఈ మేరకు అకాడమీ తరపున 2015లో లేఖ రాశామని తెలిపారు. రచయితలు ఎవరికి వారు వ్యవహరించడంపై ఆందోళన చెందానని, అకాడమీ గౌరవాన్ని కాపాడేందుకు తాను కృషి చేశానని తివారీ తెలిపారు.