ఇక మ్యాప్లో చైనా ఆక్రమిత లఢక్: రాహుల్ సంచలనం: సరిహద్దుల్లో 5 వేల పైగా డ్రాగన్ సోల్జర్స్
న్యూఢిల్లీ: సరిహద్దు వివాదాలను అడ్డుగా పెట్టుకుని భారత్పై కయ్యానికి కాలు దువ్వుతోంది చైనా. మొదట్లో సిక్కిం వద్ద డోక్లామ్ ట్రై జంక్షన్ను వివాదాస్పదంగా మార్చివేసింది. సరిహద్దుల్లో భారత జవాన్లతో ఘర్షణకు దిగింది. అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్ పరిధిలోని కొంత భూభాగాన్ని తమదిగా చూపిస్తూ మ్యాప్ను విడుదల చేసింది. భారత్తో పంచుకుంటోన్న 3500 కిలోమీటర్లకు పైగా ఉన్న సరిహద్దు ప్రాంతాన్ని 2000 కిలోమీటర్లకు కుదించి చూపిస్తోంది. తాజాగా- లఢక్ వద్ద సరిహద్దులను దాటుకుని భారత భూభాగంపైకి చొచ్చుకుని వస్తోంది క్రమక్రమంగా.

సరిహద్దుల్లో వేలాదిమంది
దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన మనదేశ సరిహద్దు జవాన్లతో చైనా పీపుల్స్ లిబరేష్ ఆర్మీ సైనికులు గొడవ పెట్టుకున్నారు. అది కాస్తా చిలికి చిలికి గాలీవానగా మారింది. భారత్పై యుద్ధానికి దారి తీసేంతటి పరిస్థితికి తీసుకొచ్చింది చైనా. సమస్యను తెగేదాకా లాగుతోంది. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి ఒకవంక దశలవారీగా చర్చలకు శ్రీకారం చుట్టిన తరుణంలో మరోవంక వేలాది మంది సైన్యాన్ని లఢక్ సరిహద్దులకు తరలిస్తోంది.

రాజకీయ దుమారం..
యుద్ధ సామాగ్రిని భారీగా చేరవేసింది. రాత్రిపూట క్లిష్ట వాతావరణంలో యుద్ధ విన్యాసాలను సాగిస్తోంది. సైనికులకు శిక్షణ ఇస్తోంది.
ఈ అంశం కాస్తా దేశంలో రాజకీయ దుమారానికి కారణమౌతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని టార్గెట్గా చేసుకుంటున్నాయి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనుసరిస్తోన్న విదేశాంగ విధానం సరైంది కాదని, రక్షణ శాఖ వ్యూహాలు చైనాకు ధీటుగా ఉండట్లేదని మండిపడుతున్నాయి.

ఇక చైనా ఆక్రమిత్ లఢక్
ఇవే తరహా పరిస్థితులు మున్ముందు కొనసాగించాల్సి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ తరహాలో.. ఇక చైనా ఆక్రమిత లఢక్ను చూడాల్సి వస్తుందని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. లఢక్లో భారత్కు చెందిన కొంత భూభాగాన్ని చైనా ఆర్మీ ఆక్రమించిందనే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం రాహుల్ గాంధీ ఓ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల గుర్తు హస్తంపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతూ రాహుల్ గాంధీ ట్విట్టర్లో ఘాటు ప్రశ్నను సంధించారు.

చేతులెత్తేసినట్లేనా
హస్తం గుర్తును రాజ్నాథ్ సింగ్ విమర్శిస్తున్నారంటే.. లఢక్ విషయంలో ఆయన చేతులు ఎత్తేసినట్టుగా భావించాల్సి ఉంటుందని అన్నారు. లఢక్లో భారత భూభాగాన్ని చైనా గానీ ఆక్రమించిందా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరా? అని నిలదీశారు. సరిహద్దుల్లో అయిదువేలమందికి పైగా చైనా ట్రూప్స్ మోహరించి ఉన్నాయని, వాళ్లు ఎందుకు అక్కడ తిష్ఠ వేశారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. లఢక్ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తున్నారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications