ఢిల్లీలో పడవలేసుకునే తిరగాలేమో! : జాన్ కెర్రీ
న్యూఢిల్లీ : భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలమవుతోంది. వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో.. ఎక్కడికక్కడే రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. తాజాగా ఇండియా పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీకి కూడా.. వర్షం బాధ తప్పలేదు.
వరద నీటితో ట్రాఫిక్ మొత్తం నిలిచిపోవడంతో.. షెడ్యూల్ కంటే గంట ఆలస్యంగా జాన్ కెర్రీ పర్యటన కొనసాగుతోంది. బుధవారం నాడు ఢిల్లీ ఐఐటీ క్యాంపస్ లో జాన్ కెర్రీ పాల్గొనాల్సి ఉండగా.. వర్షం కారణంగా, గంట ఆలస్యంగా ఆయన క్యాంపస్ కు చేరుకున్నారు.
క్యాంపస్ లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తోన్న క్రమంలో.. వర్షం గురించి ప్రస్తావిస్తూ.. పలు సరదా వ్యాఖ్యలు చేశారు జాన్ కెర్రీ. 'మీరిక్కడకు ఎలా చేరుకున్నారో నాకు అర్థం కావడంలేదు.. నాకు తెలిసి మీకు పడవలు అవసరమై ఉండాలి!' అంటూ కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే.. వర్షం కారణంగా ప్రార్థనా మందిరాల పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు కెర్రీ.
Kerry is right. Need boats here. Under the AIIMS/SAFADARJUNG flyover, right now #DelhiRains pic.twitter.com/RfemtAaDvO
— Rajesh Kalra (@rajeshkalra) August 31, 2016
ఢిల్లీ ఐఐటీ క్యాంపస్ కు వస్తోన్న క్రమంలో.. వరద నీటిలో ప్రయాణిస్తున్న కెర్రీ ఫోటోలను కొందరు జర్నలిస్టులు క్లిక్ మనిపించారు. అనంతరం వాటిని ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో.. నెటిజెన్లు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. కెర్రీ చెబుతోంది నిజమే.. ఢిల్లీలో ప్రయాణించాలంటే బోట్లు అవసరమే.. అంటూ కొంతమంది నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.