బిపిన్ రావత్ మంచినీళ్లు అడిగారు కానీ, ఇవ్వలేకపోయాం: ప్రత్యక్షసాక్షి కన్నీరు
ఊటీ: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం తర్వాత సీడీఎస్ బిపిన్ రావత్ కొంతసేపు ప్రాణాలతో ఉన్నారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. తీవ్రగాయాలతో ఉన్న ఓ వ్యక్తి తనను మంచినీళ్లు కావాలని అడిగారని చెప్పారు. అయితే, ఆయనే బిపిన్ రావత్ అని తనకు అప్పుడు తెలియదని చెప్పారు.
భారీ శబ్దంతో ప్రమాదం
తమిళనాడులోని కున్నూరు సమీపంలో హెలికాప్టర్ కూలిన ఘటన అక్కడ నెలకొన్న పరిస్థితులపై కొందరు ప్రత్యక్షసాక్షులు మీడియాకు వెల్లడించారు. మధ్యాహ్నం సమయంలో తాము పనిచేస్తున్న ప్రాంతానికి సమీపంలో భారీ శబ్ధం వినిపించింది. అక్కడకు వెళ్లి చూస్తే ఓ హెలికాప్టర్ మంటల్లో కాలుతూ కనిపించింది. దట్టమైన పొగ రావడంతో ఎవరూ కనిపించలేదని తెలిపారు.
బిపిన్ రావత్ మంచినీళ్లు అడిగారు..
ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాలతో నేలపై పడి ఉన్నారు. తాము వారి దగ్గరకు వెళ్లడంతో.. ఓ వ్యక్తి తనను మంచినీళ్లు కావాలని అడిగారని, అయితే, తాము ఆయనను బెడ్ షీట్ సాయంతో బయటకు లాగామని చెప్పారు. ఆ తర్వాత రెస్క్యూ సిబ్బంది వచ్చి ఆయనను తీసుకెళ్లారన్నారు. అయితే, తాను మాట్లాడిన వ్యక్తి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ అని తనకు తెలియదని, తర్వాత కొందరు చెబితే తెలిసిందని ప్రత్యక్ష సాక్షి చెప్పారు.
రావత్కు మంచినీళ్లు ఇవ్వలేకపోయామంటూ కన్నీరు
బిపిన్ రావత్ ఎంత గొప్ప వ్యక్తితో అప్పుడే తనకు తెలిసిందని తెలిపారు. ఈ దేశం కోసం ఎంతో సేవ చేసిన వ్యక్తికి తాను మంచి నీళ్లు కూడా ఇవ్వలేకపోయానని సదరు ప్రత్యక్ష సాక్షి కన్నీటిపర్యంతమయ్యారు. అయితే, హెలికాప్టర్ ప్రమాదంలో దట్టమైన మంటలు చెలరేగడంతో దాదాపు 14 మంది మంటల్లోనే తీవ్రంగా గాయపడ్డారు. పలువురిని గుర్తించలేని స్థితిలో ఉన్నారని అధికారులు తెలిపారు.
మార్గమధ్యలోనే రావత్ కన్నుమూశారు
కాగా, రెస్కూ టీంలు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే సరికి కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో ఉన్నట్లు సీనియర్ ఫైర్ మ్యాన్ ఒకరు తెలిపారు. ఇందులో ఒకరు సీడీఎస్ రావత్ అని చెప్పారు. ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా రక్షణశాఖ సిబ్బందికి తన పేరును హిందీలో చెప్పారని తెలిపారు. అయితే, మార్గమధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచారని చెప్పారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ అని గుర్తించేందుకు చాలా సమయం పట్టిందన్నారు. ప్రస్తుతం వరుణ్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.