అద్గదీ పనితనమంటే..! బంగారం పండించడమంటే ఇదేనేమో
జైసల్మేర్ : కార్పోరేట్ హంగు ఆర్భాటాల వెనుక పరిగెత్తే ఇప్పటి యువతకు వ్యవసాయమంటే ఓ చిన్న చూపు. పాలక వర్గాలకూ కార్పోరేట్ శక్తుల పెట్టుబడులే కావాలి కాబట్టి వ్యవసాయం లాంటి రంగాలపై నిర్లక్ష్యం కొనసాగుతోంది. అయితే ప్రభుత్వ ఉద్యోగం.. లేదంటే కార్పోరేట్ కొలువు.. అంతే తప్ప వ్యవసాయం వంక కన్నెత్తి కూడా చూడని నేటి పరిస్థితుల్లో 'ఒక్కడు' ఆ భ్రమలను బద్దలు కొట్టే పనిచేశాడు.
ఉద్యోగ జీవితం నచ్చలేదు, అందుకే ప్రభుత్వోద్యోగాన్ని పక్కనబెట్టేశాడు. వ్యవసాయానికి ఏమాత్రం అనుకూలం కానీ ఇసుక నేలల్లో 'బంగారం పండిస్తున్నాడా..?' అన్న తరహాలో సాగుతోంది ప్రస్తుతం అతని ప్రయాణం.
జైసల్మేర్ కు చెందిన హరీశ్ ధండేవ్ అనే వ్యక్తి ప్రభుత్వోద్యాగాన్ని వదులుకుని థార్ ఎడారి చుట్టూ తనకున్న 120 ఎకరాల్లో వ్యవసాయం చేయాలని భావించాడు. అయితే అవన్నీ ఇసుక నేలలు కావడంతో సాగు అంత సులువుగా సాధ్యమయ్యే పని కాదు. దీంతో సాంప్రదాయ పంటల కన్నా వాణిజ్య పంటలైతే బెటర్ అన్న ఆలోచనకు వచ్చాడు. అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న కలబంద (అలోవేరా) మొక్కలను పెంచడం మొదలుపెట్టాడు.
ఫార్మా రంగంతో పాటు ఎన్నో రకాల ఔషధాల్లో విరివిరిగా ఉపయోగించే కలబందను కొనుగోలు చేయడానికి పతంజలి లాంటి ప్రఖ్యాత సంస్థలు అతనితో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇంకేముంది 120 ఎకరాల్లో కలబందనే సాగు చేస్తోన్న అతడు ఏడాదికి రూ.1.5 కోట్ల రాబడిని పొందుతున్నాడు. తానే కాదు, పరోక్షంగా ఎంతోమందికి ఈ సాగు ద్వారా ఉపాధి కల్పిస్తున్నాడు హరీశ్.