విద్యార్థినిపై 3ఏళ్లుగా హెచ్ఎం రేప్: తల్లిదండ్రులకు బెదిరింపు
రాయ్పూర్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి మంచి మార్గాన నడిపించాల్సిన ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వక్రబుద్ధితో కీచకుడిలా మారాడు. పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని(15)పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఛత్తీస్గఢ్లోని కందగాన్ జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న అతడు మూడేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తను చెప్పినట్లు చేస్తే పరీక్షల్లో మంచి మార్కులు వేస్తానని, లేదంటే ఫెయిల్ చేస్తానని బెదిరింపులకు గురి చేసి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది.
ప్రధానోపాధ్యాయుడి అఘాయిత్యానికి బాధిత బాలిక గర్భవతి అయింది. విషయం తెలిసిన నిందితుడు ఆమెను, ఆమె తల్లిదండ్రులను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరింపులకు గురిచేశాడు. పోలీసులకు చెప్పవద్దని వారికి డబ్బు ఆశ కూడా చూపాడు.
గర్భవతి అయిన కారణంగా ఆ బాలిక పాఠశాలకు వెళ్లడం మానేసింది. కాగా, ఆమె గత నెలలో ఓ పాపకు జన్మనిచ్చింది. ఆదివారం కుటుంబసభ్యులతోపాటు పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు నిందితుడిపై ఫిర్యాదు చేసింది. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు కందగాన్ ఎస్పీ ఆదేశాలతో పోలీసులు ప్రధానోపాధ్యాయుడు మాధవ్ నాగ్(52)పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.