మరో ఘోరం: నర్సును ఇంటికి పిలిచి అత్యాచారం, తర్వాతి రోజు పంపించాడు!
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. హోంక్వారంటైన్ పేరుతో తనపై ఆరోగ్య అధికారి అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళా నర్సు ఫిర్యాదు చేశారు. తిరువనంతపురం పంగోడే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది.
ఇంటికి పిలిచి దారుణం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మలప్పురంలో 44 ఏళ్ల మహిళ హోం నర్సుగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమె విధులు ముగించుకుని తన ఇంటికి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో ఓ ఆరోగ్య అధికారి(జూనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్) ఆమెను క్వారంటైన్కు వెళ్లాల్సిందిగా సూచించారు. ఈ క్రమంలో ఆమె యాంటీజెన్ పరీక్ష చేయించుకోగా నెగిటివ్ అని తేలింది. ఆ పరీక్షల ధృవీకరణ పత్రాల్ని తన ఇంటికి వచ్చి తీసుకోవాల్సిందిగా సదరు అధికారి ఆమెకు సూచించాడు. దీంతో సెప్టెంబర్ 3న ఆమె అతడి ఇంటికి వెళ్లింది. ఈ సమయంలోనే ఆమెపై అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మళ్లీ ఆ తర్వాతి రోజు విడిచిపెట్టాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
నిందితుడి అరెస్ట్...
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. వివిధ సెక్షన్ల కింద అతనిపై కేసులు పెట్టారు. మరోవైపు మహిళా కమిషన్ కూడా కేసు నమోదు చేసి నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ వైద్య శాఖకు లేఖ రాసింది. కాగా, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందంటూ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.
కరోనా సోకిన యువతిపై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారం..
రెండ్రోజుల క్రితమే పథినంటిట్ట జిల్లాలోని పండలం కోవిడ్ కేర్ సెంటర్కు కరోనా సోకిన ఓ 19ఏళ్ల యువతిని అంబులెన్స్లో తరలిస్తున్న సమయంలో.. ఆమెపై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడ్ని అరెస్ట్ చేశారు. విధుల నుంచి తప్పించారు. ఈ ఘటన మరువక ముందే నర్సుపై అత్యాచార ఘటన వెలుగులోకి రావడంపై సర్కారుపై విమర్శలు వస్తున్నాయి.