హృదయ విదారక దృశ్యాలు ...క్యూలో సంచులు పెట్టి వలస కార్మికుల భోజన కష్టాలు
కరోనా వైరస్ భారత్ పైన కూడా పంజా విసిరింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 9406కేసులు నమోదు కాగా, 335మంది మృత్యువాత పడ్డారు . కరోనా వైరస్ కేసులు దేశంలో పెరుగుతున్న నేపధ్యంలో ఏప్రిల్ 14 వరకూ సడన్ గా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించటంతో వలస కార్మికులు పని లేక తినడానికి తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు. ఆకలి కేకలు వేస్తున్నారు.

ఢిల్లీలో వలస కార్మికుల వెతలు
ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో వలస కార్మికులు అత్యధికంగా ఉన్నారు.ఇక వారి దయనీయ పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది . అక్కడి వలస కార్మికులకు ప్రభుత్వమే పునరావాసం ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానికి భోజనం అందిస్తుంది. అయినా వారి భోజన కష్టాలకు క్యూలో పెట్టిన సంచులు ఉదాహరణగా నిలుస్తాయి. ఢిల్లీలో నిత్యం వలస కార్మికులకు భోజనం అందిస్తున్నారు. ఇక ప్రభుత్వం అందించే ఈ భోజనం కోసం పెద్ద ఎత్తున వలస కార్మికులు క్యూ కడుతున్నారు . మొదట్లో సామాజిక దూరం పాటిస్తూ క్యూ లో నిలబడే వారు.

ఆహారం కోసం క్యూలో నిలబడలేక సంచులు, వస్తువులు పెట్టి ఎదురు చూస్తున్న కార్మికులు
తినటానికి తిండి లేని అన్నార్ధుల సంఖ్య గణనీయంగా పెరగటంతో ఈ భోజనం కోసం ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి భోజనం కోసం పెద్ద ఎత్తున క్యూలు కడుతున్నారు. ఒక్కో చోట 1200 మంది వరకు నిలబడుతున్నారు. ఇక చాలా సమయం పాటు నిలబడలేకపోతున్న వారంతా సోషల్ డిస్టెన్సింగ్ లో నిలబడటం పక్కన పెట్టి వాళ్ళు నిలబడాల్సిన ప్లేస్ లో వాళ్లకు సంబంధించిన వస్తువులు పెట్టి గోడలకు ఆనుకొని కూర్చుంటున్నారు . కొందరు నీడకు నిలబడుతున్నారు. ఇక వారి ఆకలి బాధలు అలా ఉంటే సామాజిక దూరం పాటించకుండా నిలబడితే కరోనా వ్యాపిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వలస కార్మికుల ఆకలి తీర్చటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కత్తిమీద సామే
ఇక వారికి భోజనం ప్యాక్ చేసి ఇచ్చి పంపితే కాస్త ఈజీ గా ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు .ఒకపక్క పెరుగుతున్న కరోనా కేసులు, మరోపక్క పెరుగుతున్న దుర్భర పరిస్థితులు వెరసి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు వలస కార్మికుల, నిరుపేద ప్రజల ఆకలి బాధలు తీర్చటం కష్టతరంగా మారింది. కరోనా తో విధించిన లాక్ డౌన్ కొనసాగిస్తే పరిస్థితి మరింత హృదయ విదారకంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. అలా అని లాక్ డౌన్ ఎత్తి వేసినా ప్రమాదమే పొంచి ఉంది.

హృదయ విదారక ఘటనలతో ఆకలి చావులతో దేశం
ఇక వలస జీవులు బతుకు జీవుడా అంటూ పట్టెడు మెతుకుల కోసం పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల ఆహారం కోసం కుళ్ళిన కూరగాయల్లో తినటానికి పనికి వచ్చే వాటిని వెతుక్కుంటున్నారు. ఆకలి తీర్చే మానవత్వం ఉన్న మనుషుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు .ఇక కడుపు మంట చల్లారక, ఆకలి బాధ తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక ఈ హృదయ విదారక పరిస్థితుల నుండి ఎప్పుడు బయటపడతామో అని మహమ్మారి కరోనా నుండి విముక్తి ఎప్పుడు లభిస్తుందో అని ఆశగా ఎదురు చూస్తున్నారు వలస జీవులు .












Click it and Unblock the Notifications