తెలుగు రాష్ట్రాల్లో వేడిగాలులు: ఒక్క రోజే వంద మందికి పైగా మృత్యువాత
హైదరాబాద్, మే 23: దేశమంతా వేడిగాలులతో ఉడికిపోతోంది. మనుషుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వేడిగాలులు ఊపిర్లు తీస్తున్నాయి. గత మూడు రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 300 మంది దాకా మరణించారు. శనివారంనాడు సాయంత్రానికి ఈ ఒక్క రోజే రెండు రాష్ట్రాల్లో వందకు పైగా ప్రాణాలు విడిచినట్లు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. సూర్యుడు తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తుండడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు.
వడదెబ్బతో శనివారంనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో 54 మంది మృతి చెందారు. ప్రకాశం-16 మంది, నెల్లూరు-3, విజయనగరం-10, కృష్ణా-5, గుంటూరు-6, కర్నూలు-3, అనంతపురం-2 కడప-2, శ్రీకాకుళం-3, విశాఖపట్నంలో నలుగురు మృతిచెందారు. తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా పెరగడంతో పాటు వడగాలులు వీస్తుండడంతో ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బతో శనివారంనాడు 50 మంది మృతి చెందారు. ఆదిలాబాద్లో ముగ్గురు, వరంగల్-12, మెదక్-5, మహబూబ్నగర్-2, కరీంనగర్-8, ఖమ్మం-22 మంది వడదెబ్బతో మరణించారు.

కాగా, ఉష్ణోగ్రతలు రోజురోజుకూ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. ఖమ్మం జిల్లాలో శనివారంనాడు ఎన్నడూ లేని విధంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కాన్న పది డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. వడదెబ్బ ధాటికి వృద్ధులు, పిల్లలు మృత్యువాతపడుతున్నారు.
రాష్ట్రంలో వడదెబ్బ కారణంగా ఇంత మంది చనిపోవడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మరో వారం రోజులు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉండే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications