నిప్పుల కుంపటిలా తెలుగు రాష్ట్రాలు..వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి...
రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఉదయం ఎండ, రాత్రిపూట వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం ఆరున్నర నుంచే తన ప్రతాపం చూపుతున్న సూర్యుడు.. సాయంత్రం ఆరింటి వరకు శాంతించడం లేదు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఎండలకు తాళలేక జనం విలవిల్లాడుతున్నారు.

మంథనిలో 47డిగ్రీల ఉష్ణోగ్రత
తెలంగాణలో మూడు రోజుల పాటు వడగాలులు తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 42 నుంచి 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ఉత్తర ఒడిశా నుంచి రాయలసీమ వరకు ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో పొడి వాతావరణం కొనసాగుతోందని అధికారులు చెప్పారు. పెద్దపల్లి జిల్లాలో సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. మంథనిలో బుధవారం 47డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటలకు మొదలైన సూర్యుని ప్రతాపం జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది.

ఆంధ్రలోను భానుడి భగభగ
భానుడి భగభగలతో ఏపీ అల్లాడిపోతోంది. కోస్తా, రాయలసీమ తేడా లేకుండా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 3 నుంచి 6 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రచండంగా కాస్తున్న ఎండకు వడగాలులు తోడవడంతో జనం విలవిల్లాడుతున్నారు. ఉదయం ఏడింటి నుంచి వేడిగాలులు వీస్తుండటంతో మధ్యాహ్నానికి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. వడగాలల కారణంగా ఉక్కపోతతో జనం అవస్థలు పడుతున్నారు.

కోస్తాలో చెదురుమదురు వర్షాలు
ఈ నెల 11వ తేదీ నుంచి వాతావరణంలో కాస్త మార్పు వస్తుందని వాతావారణ శాఖ అంచనా వేస్తోంది. ఎండ తీవ్రత, గాలుల దిశమార్పు, ద్రోణుల ప్రభావంతో శనివారం నుంచి కోస్తాలో అక్కడక్కడా ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది. మిగతా ప్రాంతాల్లో వడగాలులు తగ్గినా ఎండ తీవ్రత మాత్రం కొనసాగుతుందని ప్రకటించింది.












Click it and Unblock the Notifications