తమిళనాడులో భారీ వర్షాలు, 9 మంది మృతి, ఓఖి తుపాను దెబ్బకు హై అలర్ట్, కేరళలో !
Recommended Video
చెన్నై: తమిళనాడు రాష్ట్రాన్ని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన రెండు గంటల్లోనే తమిళనాడు రాష్ట్రంలో సముద్ర తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో వర్షాలు మొదలయ్యాయి.
తమిళనాడులో తుపాను, కన్యాకుమారి అతలాకుతలం, నలుగురు మృతి
భారీ వర్షాలకు ఓఖి తుపాను తోడవటంతో కన్యాకుమారి జిల్లాలో గాలివానలు బీభత్సం సృష్టించింది. సుమారు 900 చెట్లు రోడ్లకు అడ్డంగా కుప్పకూలిపోవడంతో అనేక వాహనాలు ధ్వంసం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది.
విధ్యుత్ స్తంభాల దెబ్బతో !
కన్యాకుమారితో పాటు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విద్యుత్ స్తంభాలు కుప్పకూలడంతో వాహన సంచారానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముందు జాగ్రత్తగా అధికారులు విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపేశారు.
9 మంది మృతి
ఓఖి తుపాను కారణంగా కన్యాకుమారి జిల్లాలో నలుగురు, కేరళలో నలుగురు మృతి చెందారు. కొన్ని వందల మందికి గాయాలైనాయి. మొత్తం 9 మంది మృత్యువాత పడ్డారు. స్థానిక అధికారులు వెంటనే సహాయక చర్యల్లో నిమగ్నమై రోడ్ల మీద కుప్పకూలిలన చెట్లు, విద్యుత్ స్తంభాలు తొలగిస్తున్నారు.
తమిళనాడు, కేరళలో హై అలర్ట్
శుక్రవారం రాత్రి వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో సముద్ర తీర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు కన్యాకుమారిలో హైఅలర్ట్ ప్రకటించారు.
వార్నింగ్ ఇచ్చిన అధికారులు !
సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు. కన్యాకుమారిలో పర్యాటకుల రాకపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. తిరునెల్వేలి, రామేశ్వరం, కొలాచల్ తదితర ఓడరేవుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీచేశారు.
విద్యాసంస్థలకు సెలవులు !
తమిళనాడులో ఎనిమిది జిల్లాల్లో ముందుజాగ్రత్త చర్యగా అన్ని విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. కన్యాకుమారి నుంచి నాగర్కోవిల్, త్రివేండ్రం తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, బస్సు సర్వీసులను పూర్తిగా రద్దుచేశారు. ప్రైవేటు వాహనాల సంచారానికి ఆంక్షలు విధించారు.
210 కిలోమీటర్ల వేగంతో !
శ్రీలంక నుంచి 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కన్యాకుమారిలో ఎన్నడూ లేని విధంగా 210 కిలో మీటర్ల వేగంగా విపరీతమైన గాలులతో తుపాను రావడంతో స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లకే పరిమితం అయ్యారు.
చెన్నైలో హై అలర్ట్
చెన్నైలో భారీ వర్షాలు పడుతాయని ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో బుధవారం రాత్రి ప్రారంభమైన వర్షాలు శుక్రవారం వరకూ పడుతూనే ఉన్నాయి. భారీ వర్షాలతో చెన్నై నగరంలో పలు ప్రాంతాల్లో రోడ్ల మీద వర్షం నీరు నిలిచి వాహన సంచారం అస్తవ్యస్థం అయ్యింది.