ఆ నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు: చెరువులను తలపించిన ప్రధాన రహదారులు
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ నగరం వర్షంతో తడిసి ముద్దయ్యింది. ఎటు చూసినా నగరంలో వర్షపు నీరే కనిపిస్తోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఢిల్లీ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ వర్షాకాలంలో ఈ స్థాయిలో వర్షం కురవడం ఇదే తొలిసారి. బుధవారం అర్థరాత్రి ప్రారంభమైన వర్షం గురువారం తెల్లవారుజాము వరకు కురియడంతో రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి.
ఢిల్లీ నగరంలో నమోదైన వర్షపాతం
ఇక ఢిల్లీలోని ఆయానగర్ వెదర్ స్టేషన్ ప్రాంతంలో అత్యధికంగా 99.2 మిల్లీ మీటర్లు మేరా వర్షపాతం నమోదైందని ఐఎండీ తెలిపింది. పాలం మరియు రిడ్జ్ వెదర్ స్టేషన్ ప్రాంతాల్లో వరుసగా 93.6 మిల్లీమీటర్లు, 84.6 మిల్లీ మీటర్లు మేరా వర్షపాతం రికార్డు అయ్యింది.ఇక ఢిల్లీలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్ భారీగా జామ్ అయ్యింది. ఢిల్లీ రైల్వే స్టేషన్ మరియు ద్వారకా అండర్పాస్ ప్రాంతాల వద్ద వాహనాలు నిలిచిపోయాయి.
ఎడ్లబండిలో నుంచి వర్షపు నీటిలోకి...
ఇదిలా ఉంటే జకీర్ నగర్ ప్రాంతంలో వర్షపు నీరు వచ్చి చేరడంతో వాహనాలు నీటమునిగాయి. తుగ్లకాబాద్ ప్రాంతంలో ఓ ఎడ్లబండిపై కొందరు వెళుతుండగా ఒక్కసారి బండి కుదుపునకు గురికావడంతో అందులో ప్రయాణిస్తున్న వారు నీళ్లల్లో పడిపోయారు.
Recommended Video
వాతావరణశాఖ ఏం చెబుతోంది..?
ఇదిలా ఉంటే గురువారం రోజు కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని వాతావరణశాఖ పేర్కొంది. బుధవారం సాయంత్రం సిటీలో సాధారణం కంటే తక్కువ స్థాయి వర్షపాతం నమోదైంది. గత పదేళ్లలో తక్కువ స్థాయి వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారని వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు బుధవారం గురువారం మధ్య రాత్రి నుంచి వర్షం జోరుగా కురుస్తోంది. గురువారం కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ నైరుతి దిశన తుఫాను జాడలు కనిపిస్తున్నాయని తెలిపిన వాతావరణశాఖ, అటు అరేబియన్ సముద్రం నుంచి ఇటు బంగాళాఖాతం నుంచి వీస్తున్న గాలులతో తేమ తయారవుతోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications