ఉత్తరాదిలో ఆకస్మిక వరదలు-ఢిల్లీకి యమునా ముప్పు ! హిమాచల్లో కూలుతున్న కొండలు!
ఉత్తరాదిని భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు కుదిపేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు చుట్టుపక్కన ఉన్న పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆకస్మిక వరదలు కూడా వచ్చేస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు దాదాపు 20 మంది పౌరులు మృత్యువాత పడ్డారు. అంతే కాదు స్వయంగా దేశ రాజధానికే యమునా నది ముప్పు పొంచి ఉంది. దీంతో కేంద్రం ఆయా రాష్ట్రాల్ని ఆదుకునేందుకు చర్యల్ని ముమ్మరం చేసింది.
రాబోయే రెండు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఢిల్లీ,దాని పరిసర ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. హిమాచల్ ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడటం ,ఆకస్మిక వరదలు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, దెబ్బతిన్న ఇళ్ళతో సాధారణ జీవితం స్తంభించిపోయింది. మనాలి, కులు, కిన్నౌర్ ,చంబాలో రావి, బియాస్, సట్లూజ్, స్వాన్ ,చీనాబ్తో సహా అన్ని ప్రధాన నదులు ఉప్పొంగుతున్నాయి.దీంతో దుకాణాలు ,వాహనాలు కూడా ఆకస్మిక వరదలలో కొట్టుకుపోయాయి.

పొరుగున ఉన్న ఉత్తరాఖండ్లో కూడా కొండచరియలు విరిగిపడి ఆకస్మిక వరదలు వచ్చాయి. దీంతో నదులు ,వాగులలో నీటి మట్టం ప్రమాదకర స్థాయిని దాటినట్లు నివేదికలు వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని కతువా, సాంబా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అయినా మూడు రోజులుగా నిలిచిన అమర్ నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. భారీ వర్షాలతో ఢిల్లీలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. హత్నికుండ్ బ్యారేజీ నుంచి హర్యానా లక్ష క్యూసెక్కుల నీటిని యమునా నదిలోకి విడుదల చేయడంతో ఢిల్లీకి వరద ముప్పు పొంచి ఉంది.

రాజస్థాన్, పంజాబ్ ,హర్యానాలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలలో భారీగా నీరు చేరి వరదలు వస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో కొండచరియలు వరుసగా విరిగిపడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.












Click it and Unblock the Notifications