నిధుల కోసం కాంగ్రెస్ పార్టీ వినతి, సహయం చేయాలని ట్వీట్
న్యూఢిల్లీ: అధికారానికి దూరమై నాలుగేళ్ళు మాత్రమే అవుతోంది. వరుసగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయాలకు గురైంది. దీనికితోడు తీవ్రమైన ఆర్ధిక సమస్యలు కూడ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ విషయమై తమకు సహాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ద్వారా ప్రజలను కోరింది.
పదేళ్ళ పాటు కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉంది. అయితే అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ ఆర్ధిక పరమైన ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నట్టు ప్రకటించింది.
కాంగ్రెస్కు మీ సహకారం, మద్ధతు అవసరం. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటే మాకు సాయం చెయ్యండి. మీకు తోచినంత సాయం చెయ్యండి అంటూ ట్విట్టర్ వేదికగా కోరింది.
కాంగ్రెస్ పార్టీకి కార్పోరేట్ సంస్థల నుండి భారీగా విరాళాలు తగ్గాయి. ఈ విషయాన్ని ఏడీఆర్ అనే సంస్థ తన నివేదికలో పేర్కొంది. 2014 లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం కావడంతో కార్పోరేట్ సంస్థల నుండి వచ్చే విరాళాలు ఇంకా తగ్గిపోయాయి.
వరుస ఎన్నికల్లో ప్రభావం చూపుతూ వస్తోందని ఆ నివేదిక పేర్కొంది. 29 రాష్ట్రాల్లో 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు కేవలం రెండు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది. 2016-2017 లో రూ.225.36 కోట్లు విరాళాల రూపంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఇక బీజేపీకి రూ. 1,034 కోట్లు వచ్చాయి.
నిధుల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల నుండి సహకారం కోరే విషయాన్ని ఆ పార్టీకి చెందిన నేతలు రమ్య, శశిథరూర్లు సోషల్ మీడియా వేదికగా ముందుగానే ప్రకటించారు. బీజేపీ డబ్బు రాజకీయాలను ఎదుర్కోవాలంటే అది తప్పనిసరి అని థరూర్ ఆ పోస్టులో పేర్కొన్నారు.