లాక్ డౌన్ మెనూ.. వలస కార్మికులు తిండి ఇదే.. ఏ రాష్ట్రంలో ఎలాంటి భోజనం పెడుతున్నారంటే..
కరోనా లాక్ డౌన్ మనుషుల జీవన విధానంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఆహారం,నిద్ర,అలవాట్లు అన్నింటిపై ప్రభావం చూపుతోంది. ఇంట్లో ఖాళీగా కూర్చొంటుండటంతో.. కొంతమంది గంటకోసారి కడుపులో ఏదో ఒకటి పడేస్తున్నారు. గతంలో షడ్రుచులతో భోజనం చేసినవాళ్లలో కొందరు.. ఇప్పుడు ఒకటి,రెండు కూరలతో సరిపెట్టుకుంటున్నారు. భద్ర జీవితం గడుపుతున్నవారికి ఎటొచ్చి ఏ ఢోకా లేదు. కానీ బతుకుదెరువు కోసం ఊరు కాని ఊరుకి వెళ్లి లాక్ డౌన్లో చిక్కుకుపోయినవారి పరిస్థితి విషాదంగా మారింది.
ప్రభుత్వాల చొరవతో వీళ్లల్లో కొందరికి మూడు పూటలా తిండి దొరుకుతుండగా.. కొన్నిచోట్ల మాత్రం వలస కార్మికులు ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి. అయితే తిండి దొరుకుతున్న చోట.. వలస కార్మికులు ఆ భోజనంతో సంతృప్తి చెందుతున్నారా.. పరిశుభ్రమైన,రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారా.. ఆయా రాష్ట్రాల్లో వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన భోజన వసతులను ఒకసారి పరిశీలిద్దాం..

కేరళ వలస కార్మికులకు అందిస్తున్న మెనూ..
బీహార్లోని మధుబని జిల్లాకు చెందిన పింటు కుమార్(36) బతుకుదెరువు కోసం కేరళ వలసొచ్చాడు. గత 16 ఏళ్లుగా కొచ్చిలోని ఓ వుడ్ ఫర్నీచర్ పాలిషింగ్ షాపులో పనిచేస్తున్నాడు. పింటు సోదరుడు ముకేష్ కుమార్ కూడా ఇక్కడే పనిచేస్తున్నాడు. వీరితో పాటు దాదాపుగా 145 మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. పింటు తన సోదరుడు మరో ఆరుగురితో కలిసి ఓ గదిలో అద్దెకు ఉంటున్నాడు. ఇటీవల లాక్ డౌన్ కారణంగా తిండికి తిప్పలు రావడంతో స్థానికంగా ఓ స్కూల్లో ఏర్పాటు చేసిన వలస కార్మికుల క్యాంపుకు వీరిని తరలించారు.
పింటు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ క్యాంపులో ఉదయం 7.30గంటలకు బ్లాక్ టీ అందిస్తున్నారు. 9గంటలకు శనగలు/పెసరపప్పుతో కూడిన ఒక కప్పు రైస్ పోరిడ్జ్ అందిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అన్నం,సాంబార్,బీన్స్ కర్రీ అందిస్తున్నారు. సాయంత్రం 4గంటలకు ఒక కప్పు బ్లాక్ టీ,రెండు బిస్కెట్లు ఇస్తున్నారు. రాత్రి 7గంటలకు అన్నం,సాంబార్,వెజ్ కర్రీస్ వడ్డిస్తున్నారు.

మహారాష్ట్ర,ముంబైలో ఎలాంటి భోజనం పెడుతున్నారు..
ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాకు చెందిన జుబేర్ ఖాన్(27) ఈ ఏడాది ఆరంభంలో మహారాష్ట్రలోని ముంబైకి వలసొచ్చాడు. విల్సన్ కాలేజీ సమీపంలోని ఓ చిన్న హోటల్లో వెయిటర్గా పనిచేస్తున్నాడు.లాక్ డౌన్ కారణంగా రెస్టారెంట్ మూతపడటంతో తిండికి తిప్పలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వలస కార్మికుల క్యాంపులో ఉంటున్నాడు.
జుబేర్ వెల్లడించిన ఫుడ్ మెనూ వివరాల ప్రకారం.. ఈ నెల 22న ఉదయం 11గంటలకు వారికి బ్లాక్ టీ అందించారు. 12.30గంటలకు నాలుగు పూరీలు,చనా దాల్,ఒక వెజ్ కర్రీ అందించారు. రాత్రి 7.30గంటలకు దాల్ కిచిడీ భోజనం పెట్టారు. మధ్యాహ్నం లంచ్ పంపిణీ కొన్నిసార్లు త్వరగా మొదలవుతుందని.. అయితే భోజనం కోసం పెద్ద క్యూలో నిలబడాల్సి వస్తుందని తెలిపాడు. ఒకరికి ఒక ప్యాకెట్ మాత్రమే ఇస్తున్నారని.. అది మిస్ అయితే అంతే సంగతి అని చెప్పుకొచ్చాడు.

సూరత్లో వలసకార్మికులకు అందిస్తున్న మెనూ..
మహారాష్ట్ర నాగ్పూర్కు చెందిన విలాస్ మోహదికర్(35) గుజరాత్ సూరత్లోని ఒక పవర్లూమ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన ఆమె... స్థానిక స్కూల్లో ఏర్పాటు చేసిన క్యాంపులో ఉంటున్నారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. అక్కడ ఉదయం 9గంటలకు టీ,రెండు బిస్కెట్లు ఇస్తున్నారు.
లంచ్లో నాలుగు పూరీలు,ఆలు కర్రీ ఇస్తున్నారు. రాత్రి 7గంటలకు ఒక చపాతీ,మసాలా కిచిడీ అందిస్తున్నారు. కొన్నిసార్లు దాల్ రైస్ కూడా ఇస్తున్నారని.. అయితే అది స్వీట్గా ఉంటుండటంతో తినలేకపోతున్నామని ఆమె చెప్పారు. కొన్నిసార్లు సరికా ఉడకని రైస్నే పెడుతున్నారని చెప్పారు.

ఢిల్లీలో ఎలాంటి భోజనం..
బీహార్లోని దర్బంగాకు చెందిన జైబిన్ యాదవ్(27) న్యూఢిల్లీలోని గాంధీనగర్ హోల్ సేల్ మార్కెట్లో కూలీగా పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా యమునా స్పోర్ట్స్ కాంప్లెక్సులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపులో ఉంటున్నాడు. దాదాపు 900 మంది వలస కార్మికులు ప్రస్తుతం ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు.
జైబిన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉదయం 7గంటలకు ఒక కప్పు టీ,రెండు బిస్కెట్ల,టోస్ట్ అందిస్తున్నారు. 8గంటలకు రెండు అరటిపళ్లు లేదా యాపిల్ లేదా బత్తాయిలు అందిస్తున్నారు. లంచ్లో దాల్ రైస్,రోటీ ఇస్తున్నారు. సాయంత్రం 7గంటలకు పూరి,ఆలు కర్రీ ఇస్తున్నారు.
Recommended Video

సర్దుకుపోతున్న వలస జీవులు..
పింటు కుమార్ లాంటి వలస కార్మికులు సాధారణ రోజుల్లో నాన్ వెజ్ లేనిదే ముద్ద ముట్టుకునేవారు కాదు. కానీ ఇప్పుడు తప్పట్లేదని అతనే చెబుతున్నాడు. కనీసం ఈ మాత్రం ఫుడ్ అయినా దొరుకుతుందన్నందుకు సంతోషిస్తున్నామని చెప్పాడు. పింటు కుమార్ ఒక్కడే కాదు.. చాలామంది వలసకార్మికులు ఫుడ్ విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొన్ని వంటలు వారికి నచ్చకపోవచ్చు.. కొన్నిసార్లు అంత శుభ్రంగా లేకపోవచ్చు. అయినా సరే,ఇలాంటి పరిస్థితుల్లో సర్దుకుపోవడం తప్ప ఏమీ చేయలేమని చెబుతున్నాడు.












Click it and Unblock the Notifications