Narendra Modi: ఏప్రిల్ 30 కాకుండా మే 3 వరకు లాక్డౌన్ ఎందుకు పొడిగించారో తెలుసా?
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ క్రమంగా పెరుగుతున్న దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు రాష్ట్రాలు ఇప్పటికే ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 14తో మొదటగా విధించిన లాక్డౌన్ గడువు ముగియడంతో మంగళవారం ఉదయం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ.. మే 3 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
Recommended Video
రాష్ట్రాలు ఏప్రిల్ 30 వరకే..
కాగా, దేశంలోని పలు రాష్ట్రాలు ఏప్రిల్ 30 వరకే లాక్డౌన్ పొడిగించినప్పటికీ.. ప్రధాని మోడీ మాత్రం మే 3 వరకు లాక్డౌన్ పొడిగించారు. దీంతో దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్డౌన్ అమలు కానుంది. ప్రధాని మోడీ మే 3 వరకు పొడిగించడానికి ఒక ప్రత్యేక కారణం ఉందని విశ్వసనీయవర్గాలు ద్వారా తెలిసింది.
దేశ వ్యాప్త లాక్డౌన్ మే 3 వరకు ఎందుకంటే..
ఏప్రిల్ 30 వరకు రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి. అదే తేదీని ఒకవేళ మోడీ ప్రకటిస్తే చాలా గందరగోళ పరిస్థితి నెలకొనేది. ఎందుకంటే.. మే 1 కార్మిక దినోత్సవం కావడంతో ఆ రోజు సెలవు దినం. ఇక మే 2న శనివారం, మే 3న ఆదివారం. ఇవి కూడా వీకెండ్స్ కావడంతో ఎక్కువ మంది ప్రజలకు సెలవుదినాలుగా ఉన్నాయి. ఏప్రిల్ 30 వరకే లాక్డౌన్ ప్రకటిస్తే ఈ మూడు రోజుల్లోనే జనం ఎక్కువగా బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో మళ్లీ ఏవైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో మోడీ మే 3న గడువు తేదీగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక మే 4 సోమవారం కావడంతో ప్రజలు తమ పనుల్లోనే నిమగ్నమయ్యే అవకాశం ఉంటుంది.
సీఎంల వినతులు..
అంతేగాక, ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగానికి ముందే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వీలైతే దేశ వ్యాప్తంగా లాక్డౌన్ గడువు(ఏప్రిల్ 30 కంటే ఎక్కువ)ను పెంచాలని కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా లాక్డౌన్ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
అదే స్ఫూర్తితో..
ప్రజల ప్రాణాలను కాపాడుకోవడం కోసం లాక్ డౌన్ పొడగించక తప్పడం లేదని ప్రధాని వ్యాఖ్యానించారు. తొలి లాక్డౌన్ కాలాన్ని ప్రజలు ఎంతో సహకరించి విజయవంతం చేశారని.. భారత రాజ్యాంగ పీఠికలోని ‘భారత ప్రజలమైన మేము' అన్న స్ఫూర్తిని చాటారని ప్రధాని ప్రశంసించారు. అదే స్ఫూర్తిని మరోసారి ప్రదర్శించి కరోనా మహమ్మారిని దేశం నుంచి పారద్రోలేందుకు కట్టుబడి ఉండాలన్నారు. కరోనా కట్టడి కోసం లాక్డౌన్ అనేది సరైన చర్య అని, ప్రపంచంలోని చాలా దేశాలు ఇదే బాటలో నడుస్తున్నాయన్నారు. దేశ ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తూ, వ్యక్తిగత శుభ్రతను పాటించాలని పిలుపునిచ్చారు.