భార్యను నల్లగా ఉన్నవనడం నేరం కాదు: హైకోర్టు
మదురై: నల్లగా ఉన్నావని విమర్శించడం వల్ల ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న కేసులో భర్తను నేరస్థుడిగా తీర్పు ఇవ్వలేమని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడుకు చెందిన పరమశివం, సుధా భార్యాభర్తలు.
నల్లగా ఉన్నావంటూ సుధను ఎప్పుడూ పరమశివం దెప్పి పొడిచేవాడు. ఈ క్రమంలో 2001లో సుధ ఆత్మహత్యకు పాల్పడింది. సుధ మృతి భర్త పరమశివం వేధింపులే కారణమని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

కేసు విచారణకు చేపట్టిన తిరునల్వేళి జిల్లా కోర్టు వరకట్న వేధింపులు, గృహహింస చట్టం కింద పరమశివంను నిందితుడిగా నిర్ధారిస్తూ 2006లో ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ పరమశివం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణన్ ఈ కేసులో తీర్పు వెలువరించారు. 'నలుపు రంగులో ఉన్నావని భార్యను విమర్శించడం.. వేధింపులు, హింసించడం కాదు. భార్య ఆత్మహత్య చేసుకునేలా పరమశివం ప్రేరేపించలేదు' అని పేర్కొంటూ దిగువకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది.












Click it and Unblock the Notifications