ఢిల్లీ అసెంబ్లీలో హైడ్రామా, మోడీకి కేజ్రీవాల్ సవాల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీలో మంగళవారం నాడు హైడ్రామా నడిచింది. బీజేపీ ఎమ్మెల్యేను సభ నండి బయటకు పంపించారు. మాజీ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ ఫేక్ డిగ్రీ విషయమై విపక్ష బీజేపీ ఎమ్మెల్యే ప్రస్తావించారు.
తోమర్ విషయమై ఏఏపీని కార్నర్ చేసేందుకు బీజేపీ ప్రయత్నించింది. తోమర్ అరెస్టు, ఫేక్ డిగ్రీ పైన చర్చించేందుకు బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ డిమాండ్ చేశాడు. ప్రొసీడింగ్స్ను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ అతనిని హౌస్ నుంచి స్పీకర్ బయటకు పంపించారు.
మరోవైపు, కేజ్రీవాల్ తోమర్ ఫేక్ డిగ్రీ విషయమై మాట్లాడారు. తోమర్ విషయం వెలుగులోకి రాగానే తాము అతనిని కేబినెట్ నుండి తొలగించామని, మరి ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజేల పైన ఎందుకు చర్యలు తీసుకోలేదని కేజ్రీ ప్రశ్నించారు.
తోమర్ ఫేక్ డిగ్రీ విషయమై తనకు మొదట తెలియదని చెప్పారు. తాము స్వచ్ఛమైన పాలన అందించేందుకు అధికారంలోకి వచ్చామని, ఎలాంటి తప్పు ఎవరు చేసినా ఉపేక్షించమని చెప్పారు. తనకు ఏ మంత్రితోను, ఏ ఎమ్మెల్యేతోను సంబంధం లేదని, తప్పు చేస్తే తొలగిస్తానని చెప్పారు.