దానికి సిద్ధంగా లేం: ఖురాన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!!
న్యూఢిల్లీ: కర్ణాటకలో తీవ్ర దుమారానికి దారి తీసిన హిజబ్ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఖురాన్ గురించి మాట్లాడటానికి తాము దాన్ని అధ్యయనం చేయలేదని పేర్కొంది. ఖురాన్ను తాము అన్వయించుకోవడానికి తాము సన్నద్ధం కాలేదని పేర్కొంది. హిజాబ్ మతపరమైన సిద్ధాంతం అని, అలాంటి విషయాలు విచారణకు వచ్చినప్పుడు వాటి సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి సన్నద్ధం కావాల్సి ఉంటుంది స్పష్టం చేసింది.
పాఠశాలలు, కళాశాల్లో హిజబ్ను నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ కొన్ని ముస్లిం సంఘాలు కర్ణాటక హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాయి. దీన్ని విచారించిన అనంతరం కర్ణాటక హైకోర్టు- ప్రభుత్వ ఆదేశాలను సమర్థించింది. వాటిపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాయి పలు ముస్లిం సంఘాలు.
సుప్రీంకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది. తాజాగా విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్షు ధులియా కీలక వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ వరుస కేసులను విచారిస్తున్నప్పుడు పలు మతపరమైన అంశాలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. హిజబ్ అంశంపై అనేది ఒక మతానికి సంబంధించినది, దీనిపై వాదనలను వింటోన్నప్పుడు ఖురాన్పై వ్యాఖ్యలు చేయాల్సి వస్తోందని గుర్తు చేశారు.
ఖురాన్పై వ్యాఖ్యానించాల్సిన పరిస్థితి ఎదురైనప్పుడు తాము దానిపై పూర్తి అవగాహనను కలిగి ఉండాల్సి ఉంటుందని అన్నారు. ఖురాన్పై వ్యాఖ్యానించడానికి తాము సిద్ధంగా లేమని న్యాయమూర్తులు చెప్పారు. మత పరమైన అంశాలు, గ్రంథాల గురించి చర్చించడానికి న్యాయస్థానాలు సన్నద్ధంగా లేవని స్పష్టం చేశారు. సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, కోలిన్ గొన్జాల్వెస్, మీనాక్షి అరోరా, జైనా కొఠారి, ఏఎమ్ దర్, షోయబ్ ఆలం పిటిషనర్ల తరఫున తమ వాదనలను వినిపించారు.