సొంత పార్టీ నేతకు కమలం హ్యాండ్: సీఎంగా హిమంత: బీజేఎల్పీ నేతగా ఎన్నిక: సాయంత్రమే
గువాహటి: వారం రోజులుగా అస్సాం నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితులకు తెర పడింది. కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలను స్వీకరిస్తారనే ఉత్కంఠతకు భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం తెర దించింది. సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి శర్బానంద సొనొవాల్ను పక్కన పెట్టింది. ఆయన వారసుడిగా హిమంత బిశ్వ శర్మ పేరును ప్రకటించింది. ఈ మేరకు గువాహటిలో నిర్వహించిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో హిమంత పేరును ఖరారు చేశారు. బీజేపీ సభ్యులు- శాసన సభలో తమ పార్టీ నాయకుడిగా ఆయనను ఎన్నుకున్నారు.
బీజేఎల్పీ నేతగా హిమంత
గువాహటిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సుమారు గంటకు పైగా ఈ భేటీ కొనసాగింది. అధిష్ఠానం దూతగా బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర ఆహార, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ దీనికి హాజరయ్యారు. సిట్టింగ్ మంత్రి హిమంత బిశ్వ శర్మ, మాజీ ముఖ్యమంత్రి శర్బానంద సొనొవాల్, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభా పక్ష నేతగా హిమంత బిశ్వ శర్మ పేరును నరేంద్ర సింగ్ తోమర్ ప్రతిపాదించగా.. సభ్యులు దాన్ని బలపరిచారు. దీనితో అస్సాం కొత్త ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తోమర్ ప్రకటించారు.
అంతకుముందే సొనొవాల్ రాజీనామా..
బీజేపీఎల్పీ సమావేశం కావడానికి ముందే- ముఖ్యమంత్రి శర్బానంద సొనొవాల్ తన పదవికి రాజీనామా చేశారు. గువాహటి రాజ్భవన్లో గవర్నర్ జగదీష్ ముఖిని కలిసి, తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ రాజీనామా పత్రాన్ని గవర్నర్ వెంటనే ఆమోదించారు. అనంతరం సొనొవాల్ రాజ్భవన్ నుంచి నేరుగా బీజేఎల్పీ సమావేశానికి హాజరయ్యారు. హిమంతను బీజేఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లుగా రూపొందించిన పత్రంపై సంతకం చేశారు.
సాయంత్రం గవర్నర్తో భేటీ..
ఇదిలావుండగా- హిమంత బిశ్వ శర్మ ఈ సాయంత్రం 4 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ను కలుసుకోనున్నారు. బీజేఎల్పీలో చేసిన తీర్మానాన్ని ఆయనకు అందజేస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. సోమవారం ఉదయమే హిమంత ప్రమాణ స్వీకారం ఉండొచ్చని రాజ్భవన్ వర్గాలు చెబుతున్నాయి. హిమంత బిశ్వ శర్మ సమర్థుడైన నాయకుడిగా పేరు తెచ్చుకోవడం, అస్సాం బీజేపీకి చెందిన మెజారిటీ నాయకులు ఆయన నాయకత్వం వైపే మొగ్గు చూపడం వంటి కారణాల నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది.
Recommended Video
కాంగ్రెస్ నుంచి వలస
హిమంత బిశ్వశర్మ కాంగ్రెస్ నాయకుడు. సుదీర్ఘకాలం పాటు ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2015లో పార్టీ ఫిరాయించారు. బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. 2016 నాటి ఎన్నికల్లో పోటీ చేశారు. ఘన విజయాన్ని అందుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన జలుక్బారి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన తిరుగులేని మెజారిటీతో గెలుపొందారు.
1,01,911 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి రామెన్ చంద్ర బోర్థకుర్పై విజయం సాధించారు. హిమంతకు లభించిన 1,30,762. లక్షకు పైగా ఓట్లను సాధించడం ఆయనకు ఇది వరుసగా రెండోసారి. 2016 ఎన్నికల్లో ఆయన ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 1,18,890 ఓట్లను తన ఖాతాలో వేసుకున్నారు. సొనొవాల్ కేబినెట్లో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు.