పూణేలో పేలుళ్లకు కుట్రపన్నిన హిందూ మితవాద సానుభూతి పరులు అరెస్ట్
పూణే: హిందూ మితవాద సంస్థ సనాతన్ సంస్థ సానుభూతిపరులుగా ఉన్న ఐదుగురిని మహారాష్ట్ర యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ అరెస్టు చేసిన ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచింది. గతేడాది సన్బర్న్ పేరుతో పూణేలో జరిగిన ఎలక్ట్రానికి డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్లో పేలుళ్లు జరిపేందుకు కుట్రపన్నారని ఏటీఎస్ కోర్టుకు తెలిపింది. వీరందని ఈ నెల మొదట్లో నల్లసోపార, పూణే, జల్నాల్లో అరెస్టు చేశారు.
వైభవ్ రౌత్, షరద్ కలస్కార్, సుధాన్వ గొందాలేఖర్, శ్రీకాంత్ పంగార్కర్లను ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది ఏటీఎస్. వారి కస్టడీని మరింత పొడిగించాలని ఏటీఎస్ తరపున న్యాయవాదులు జడ్జిని కోరారు. దీంతో జస్టిస్ సమీర్ అద్కర్ ఏడురోజుల పాటు కస్టడీని పొడగిస్తూ ఆదేశాలిచ్చారు. మరో వైపు ఐదో నిందితుడు అవినాష్ పవార్ను ఆగష్టు 31న కోర్టులో హాజరుపరుస్తారు. పూణేలో గతేడాది డిసెంబర్లో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్లో పేలళ్లు జరిపేందుకు గొందాలేఖర్, రౌత్లు కుట్రపన్నారని ఏటీఎస్ తెలిపింది. హిందూ సంస్కృతికి వ్యతిరేకం కావడంతో వారు పేలుళ్లు జరపాలని భావించినట్లు ఏటీఎస్ వెల్లడించింది.అప్పటి వరకు సన్బర్న్ కార్యక్రమం గోవాలో జరిగేది. 2015 తర్వాత దీన్ని పూణేకు మార్చారు.
అరెస్టు అయిన ఐదుగురు థానే జిల్లాలోని కళ్యాణ్ నగరంలో, కర్నాటకలోని బెలగావిలో ఉన్న సినిమా హాళ్ల బయట పెట్రోల్ బాంబులు విసిరారని ఏటీఎస్ పేర్కొంది. పద్మావత్ చిత్రం ప్రదర్శించరాదంటూ అది హిందూ మతానికి వ్యతిరేకంగా ఉందని చెబుతూ ఈ దారుణానికి వీరు పాల్పడ్డారు. అంతేకాదు కొందరు ప్రముఖలను కూడా హతమార్చేందుకు వీరు కుట్ర పన్నినట్లు ఏటీఎస్ చీఫ్ చెప్పారు. అందులో ఒక రచయిత చరిత్రకారుడు, మరాఠీ దినపత్రిక మాజీ ఎడిటర్, మరో ముగ్గురు మరాఠీ రచయితలు ఉన్నారని చెప్పారు. భద్రతాకారణాల వల్ల వారి పేర్లను వెల్లడించలేమని మహారాష్ట్ర ఏటీఎస్ ఛీఫ్ అతుల్ చంద్ర కుల్కర్ణి చెప్పారు.
నల్లసోపారా, పూణేల్లో వీరికి సంబందించిన మూడు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పిన ఏటీఎస్ ఛీఫ్... ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య చేసేందుకు ఇందులో ఒక బైకును వాడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఇక మిగతా ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన ఏటీఎస్ వీరికి సంబంధించిన 10 తుపాకులు, ఒక ఎయిర్ పిస్టోల్, ఒక నాటుతుపాకీ, ఆరు మ్యాగజీన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక నిందితులు వినియోగించిన మారణాయుధాలను ఒక్కక్కటిగా వేరు చేసి వేర్వేరు ప్రాంతాల్లో పడేశారు. వాటిని ఇంకా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని ఏటీఎస్ తరపున న్యాయవాది సునిల్ గొన్సాల్వేస్ తెలిపారు.