జాతకాలు కలవట్లేదు-అందుకే నా గర్ల్ఫ్రెండ్కి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నా- హైకోర్టులో ఓ యువకుడి పిటిషన్
జాతకాలు కలవని కారణంగా పెళ్లి చేసుకుంటానని తన గర్ల్ఫ్రెండ్కు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నానని 33 ఏళ్ల ఓ యువకుడు దాఖలు చేసిన పిటిషన్ను ముంబై హైకోర్టు కొట్టిపారేసింది. ఆ యువతిని పెళ్లి చేసుకోకుండా ఉండటానికి ఇదొక సాకు మాత్రమేనని పేర్కొంది. కేసు పూర్వపరాలను పరిశీలిస్తే... ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశం ముందు నుంచి అతనిలో ఎక్కడా కనిపించలేదని వ్యాఖ్యానించింది. జాతకాల పేరు చెప్పి కేసు నుంచి బయటపడాలని చూడటం కుదరదని పరోక్షంగా తేల్చి చెప్పింది.
అసలేంటీ కేసు
బాధిత మహిళ ఫిర్యాదు ప్రకారం... 2012 నుంచి కొన్నేళ్ల పాటు ఆమె ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేసింది.ఆ సమయంలో అవిషేక్ మిత్రా(33) అనే యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు. ప్రేమ పేరుతో ఎమోషనల్గా ఆమెకు దగ్గరైన యువకుడు... పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో ఆమెను శారీరకంగా లోబర్చుకున్నాడు.పలుమార్లు ఆమెతో శారీరకంగా కలిశాడు.కొన్నాళ్లకు ఆమె గర్భం దాల్చడంతో బలవంతంగా అబార్షన్ చేయించాడు.రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుందామని... ఇప్పుడు తన మాట వినాలని బలవంతం చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది.
పోలీసుల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి...
ఆ తర్వాత కొద్దిరోజులకు అభిషేక్ ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. దీంతో డిసెంబర్ 28,2012న అభిషేక్పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.దీంతో అప్పటి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ యువతితో పాటు యువకుడికి ఇద్దరి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ సమయంలో అభిషేక్ ఆమెను బేషరతుగా పెళ్లి చేసుకుంటానని మరోసారి మాటిచ్చాడు.దీంతో పోలీసులు అతన్ని పంపించేశారు.
నెల రోజులకే మళ్లీ షాకిచ్చాడు
అభిషేక్ మారిపోయాడని ఆ యువతి భావించింది.అతనిపై చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకుంది.కానీ ఆ తర్వాత నెల రోజులకే అభిషేక్ షాకిచ్చాడు.తాను ఆమెను పెళ్లి చేసుకోనని పోలీస్ స్టేషన్లో తమకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీస్ అధికారికి లిఖితపూర్వకంగా లేఖ రాసి పంపించాడు.దీంతో బాధిత యువతి అభిషేక్పై మళ్లీ ఫిర్యాదు చేసింది.ఆ మేరకు అతనిపై అత్యాచారం,మోసం కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో పోలీసులు చార్జిషీట్ కూడా దాఖలు చేశారు.
అభిషేక్ వాదనను తోసిపుచ్చిన కోర్టు
బాధిత యువతి పెట్టిన కేసును అభిషేక్ ట్రయల్ కోర్టులో సవాల్ చేశాడు.అక్కడ చుక్కెదురవడంతో హైకోర్టును ఆశ్రయించాడు.జాతకాలు కలవని కారణంగానే తన గర్ల్ఫ్రెండ్కు పెళ్లి చేసుకుంటానని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నానని పిటిషన్లో పేర్కొన్నాడు.తాజాగా ముంబై హైకోర్టులో ఈ పిటిషన్ విచారణకు రాగా... హైకోర్టు దాన్ని కొట్టివేసింది.అతని వాదనను తోసిపుచ్చింది. మొదటి నుంచి అతను పెళ్లిని తప్పించుకుంటూనే వస్తున్నాడని... పెళ్లి చేసుకునే ఉద్దేశమే ఉంటే ఇలా సాకులు చెప్పేవాడు కాదని పేర్కొంది.కాబట్టి జాతకాల పేరు చెప్పి కేసును కొట్టివేయడం కుదరదని తేల్చి చెప్పింది.