నైట్ డ్యూటీలో ఉన్న వైద్యవిద్యార్థినిపై అత్యాచారయత్నం
ఘజియాబాద్: రాత్రిపూట విధుల్లో ఉన్న వైద్య విద్యార్థినిపై ఆస్పత్రి సిబ్బందిలో ఒకతను అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్లో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఎండి చదువుతున్న ఆ విద్యార్థిని ఆస్పత్రిలోని విశ్రాంతి గదిలో నిద్రపోతుండగా ఒకతను వచ్చి ఆమెపై అత్యాచారం యత్నం చేశాడు.
ఆ మేరకు సియానీ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. రవి అనే పారిశుధ్య ఉద్యోగి తెరిచి ఉన్న కిటికీ గుండా లోనికి ప్రవేశించి ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని ఇన్స్పెక్టర్ అశోక్ సిసోడియా తెలిపారు. అయితే, ఆమె వెంటనే సాయం కోసం కేకలు వేయడంతో ఇతర ఉద్యోగులు పరుగున అక్కడికి చేరుకున్నారు. వాళ్లు వస్తున్న విషయం గ్రహించి రవి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు.
ఆ తర్వాత ఆస్పత్రి సూపరింటిండెంట్తో కలిసి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు సేవానగర్ నివాసి. నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు సిసోడియా చెప్పారు. 24 ఏళ్ల బాధితురాలు సంతోష్ మెడికల్ కాలేజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తోంది. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత సోమవారం తెల్లవారు జామును 3 గంటల ప్రాంతంలో ఆ సంఘటన జరిగింది.
రవి గత నెలలోనే ఉద్యోగంలో చేరాడు. తాను గత ఐదారు రోజులుగా అవకాశం చూస్తున్నానని, చివరికి సోమవారం తెల్లవారు జామును అవకాశం లభించిందని, ఆమె నిద్రపోతోందని, గార్డ్స్ టీ కోసం వెళ్లారని, దాంతో తనకు అవకాశం లభించిందని నిందితుడు రవి కుమార్ పోలీసులకు చెప్పాడు. పారిపోతూ రవి కుమార్ తన చొక్కాను మరిచిపోయాడు. దాంతో అతన్ని గుర్తించడం సులభమైంది. కుమార్ పశ్చిమ యుపిలోనే భాగ్పట్కు చెందినవాడు.