జీఎస్టీ, రెరా దెబ్బ: ఆ రెండు తప్ప.. 9 ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ ఢమాల్..
కేవలం ముంబై, గుర్గావ్ నగరాలు మాత్రం రియల్ వ్యాపారంలో డిమాండ్ అండ్ సప్లయ్ పద్దతిలో కాస్త పురోగతి చెందినట్టు రిపోర్టులో వెల్లడైంది.
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంపై జీఎస్టీ తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దానికి తోడు రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్&డెవలప్మెంట్ యాక్ట్ కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపించడంతో దేశవ్యాప్తంగా గృహ విక్రయాలు పడిపోయాయి.
దేశంలోని 9 ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా మందగిస్తూ వస్తోందని, ప్రాపర్టీ మార్కెట్లో గత సెప్టెంబర్ క్వార్టర్ లో ఇయర్ ఆన్ ఇయర్ ఇది 18శాతం క్షీణించిందని తాజా రిపోర్టులో తేలింది. రియల్ ఎస్టేట్ ప్రతికూలతను ఎదుర్కొంటున్న ప్రధాన నగరాల్లో హైదరాబాద్ కూడా ఉంది.
రియల్టీ పోర్టల్ ప్రాప్ టైగర్.కామ్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. డీమానిటైజేషన్ తో మందగించిన రియల్ ఎస్టేట్ రంగంపై కొత్త చట్టం రెరా కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించినట్టు రిపోర్టులో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త గృహ నిర్మాణ ప్రాజెక్టులు కూడా తగ్గుముఖం పట్టాయి.
కాగా, ఈ ఏడాది సెకండ్ క్వార్టర్లో దాదాపు 53 శాతం క్షీణించిన రియల్ వ్యాపారం.. 22, 115 యూనిట్లకు పడిపోయిందని రిపోర్టులో పేర్కొన్నారు. పుణే, నోయిడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్ కత్తా, అహ్మదాబాద్లో గృహ అమ్మకాలు, అలాగే కొత్త ప్రాజెక్టుల లాంచింగ్ భారీగా పడిపోయినట్టు నివేదికలో పొందుపరిచారు.
కేవలం ముంబై, గుర్గావ్ నగరాలు మాత్రం రియల్ వ్యాపారంలో డిమాండ్ అండ్ సప్లయ్ పద్దతిలో కాస్త పురోగతి చెందినట్టు రిపోర్టులో వెల్లడైంది. మొత్తం మీద జీఎస్టీ, నోట్ల రద్దు, రెరా కారణంగా 2018 ఆర్థిక రెండో త్రైమాసికంలో అమ్మకాలు తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొన్నాయని ప్రాప్ టైగర్.కాం చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్ అంకుర్ ధావన్ తెలిపారు.
అయితే జులై, అగస్టు నెలలతో పోలిస్తే ఫెస్టివ్ సీజన్ లో అమ్మకాలు గణనీయంగా మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో అహ్మదాబాద్ ప్రాపర్టీ మార్కెట్ 46శాతం క్షీణించింది. దాంతో 2,222యూనిట్లకు విక్రయించింది. బెంగళూరులో 27శాతం తగ్గి, 6,976యూనిట్లు, చెన్నై 23శాతం నీరసపడి 2,945యూనిట్లు, కోల్ కతా 21శాతం 2,993 యూనిట్లు, హైదరాబాద్ 18 శాతం తగ్గి 3,356 యూనిట్లను విక్రయాలు జరిగినట్టు అధ్యయనంలో తేలింది.
ఇక ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ముంబై ప్రాపర్టీ అమ్మకాలు 6 శాతం పెరిగి 12,101 యూనిట్లకు చేరుకున్నాయి. అలాగే గుర్గావ్ ప్రాపర్టీ అమ్మకాలు 60 శాతం వృద్ధితో 3,342 యూనిట్లకు చేరుకున్నాయి.