యుద్దం ఆపమంటూ పుతిన్ ను ఆదేశించగలమా : సీజేఐ ఎన్వీ రమణ - సుప్రీంలో వ్యాజ్యం..!!
ఉక్రెయిన్- రష్యా యుద్ధానికి సంబంధించిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్ధులను స్వదేశానికి తీసుకొచ్చే అంశం పైన ఒక న్యాయవాది పిటీషన్ దాఖలు చేసారు. జమ్ము కాశ్మీర్ కు చెందిన విద్యార్ధులు అక్కడ చిక్కుకున్నారని..వారిని త్వరగా స్వదేశానికి రప్పించటం పైన తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆ న్యాయవాది తన పిటీషన్ లో కోరారు. ఈ రోజు కోర్టు ప్రారంభం కాగానే..న్యాయవాది తన పిటీషన్ గురించి ప్రస్తావించారు. దీని పైన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు.

పుతిన్ ను ఆదేశించగలమా
యుద్దం విషయంలో కోర్టు ఏం చేయగలదు.. యుద్దం ఆపమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కోర్టు ఆదేశించగలదా అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలోనూ కొందరు సీజేఐ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్న పోస్టులు తాను చూశానని చెప్పారు. దీంతో..విద్యార్ధుల తరలింపు వేగవంతం చేయటం పైన కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ సీజేఐ ని కోరారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్ధుల్లో ఎక్కువ మంది బాలిలకే ఉన్నారని..అక్కడ నెలకొన్ని వాతావరణ పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీజేఐకి నివేదించారు.

విద్యార్ధుల తరలింపు విషయంలో
దీనికి స్పందించిన సీజేఐ.. అక్కడ ఉన్న విద్యార్దుల విషయంలో తమకు జాలి ఉందన్నారు. వారిని రప్పించటం కోసం కేంద్రం చేయగలిగిన ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. అయినా, ఈ వ్యవహారంలో ఏ విధంగా ముందుకెళ్లాలో అటార్నీ జనరల్ ను అడుగుతామని పేర్కొన్నారు. ఈ పిటీషన్ పైన విచారణ చేస్తామని..అప్పటి వరకు వేచి ఉండాలని సీజేఐ సూచించారు. ఇక, ఇప్పటికే ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి వచ్చే భారతీయుల సంఖ్య భారీగా పెరిగినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.

ఉక్రెయిన్ సరిహద్దులు దాటి
తమ సూచనలు జారీ అయిన తర్వాత ఇప్పటివరకూ 17వేల మంది భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దులు దాటినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. గత 24గంటల్లో 6 విమానాలు దిల్లీలో ల్యాండైనట్లు చెప్పారు. ఇప్పటివరకూ మొత్తం 15విమానాల ద్వారా 3,352 మంది స్వదేశం చేరినట్లు బాగ్చి వెల్లడించారు. మరో 24 గంటల్లో 15 విమానాలను షెడ్యూల్ చేసినట్లు పేర్కొన్న ఆయన... వాటిలో కొన్ని ఇప్పటికే దారిలో ఉన్నట్లు ప్రకటించారు. ఉక్రెయిన్ లో పలు నగరాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయని చెప్పారు. గతరాత్రి కొంతమంది విద్యార్థులు ఖార్కివ్ నుంచి రైలు ద్వారా బయలుదేరారని తెలిపారు.












Click it and Unblock the Notifications