గాల్వన్ వ్యాలీలో అసలేం జరిగింది... ఎందుకీ ఘర్షణలు.. భారత సైనికులను చైనా వేటాడి మరీ...
భారత్-చైనా సరిహద్దులోని గాల్వన్ వ్యాలీలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్లో 20 మంది భారత సైనికులు,43 మంది చైనాకు చెందిన పీఎల్ఏ సైనికులు మరణించారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల్లో సైనికులు నేలకొరిగారు. 1967లో చివరిసారిగా భారత్-చైనా మధ్య నాథు లా ఘర్షణల్లో 80 మంది భారత సైనికులు మృతి చెందారు. అదే సమయంలో 300 మంది చైనా సైనికులు మృతి చెందారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు వాస్తవాధీన రేఖ వెంబడి భారత్-చైనా సరిహద్దు మరోసారి రక్తసిక్తమైంది. ఈ నేపథ్యంలో తాజా ఘర్షణలకు దారితీసిన పరిస్థితులను ఒకసారి పరిశీలిద్దాం...
నలుగురు కాదు 43 మంది, పలువురు గాయపడ్డారు కూడా, పెరిగిన చైనా జవాన్ల మృతుల సంఖ్య..?
ఎలా మొదలైంది..
వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న గాల్వన్ వ్యాలీలోని ప్యాట్రోలింగ్ పాయింట్ 14 వద్ద చైనా గత కొద్ది రోజుల క్రితం ఒక టెంట్ ఏర్పాటు చేసుకుంది. తాజాగా భారత సైన్యం ఆ టెంట్ను తొలగించింది. దీంతో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారత సైన్యంపై రాళ్లు రువ్వింది. అంతేకాదు,ఐరన్ రాడ్లతో వారిపై దాడికి పాల్పడింది. ఈ క్రమంలో భారత సైనికులు కూడా ధీటుగా ప్రతిఘటించడంతో... ఇరువైపులా కొంతమంది సైనికులు మృతి చెందారు. భారీ సంఖ్యలో సైనికులు గాయపడగా.. వారిని మిలిటరీ ఆస్పత్రుల్లోని క్రిటికల్ కేర్ యూనిట్లకు తరలించారు.
చర్చల తర్వాత కూడా టెంట్ తొలగించని చైనా..
నిజానికి పాయింట్ 14 వద్ద పీఎల్ఏ ఏర్పాటు చేసుకున్న టెంట్ను తొలగించేందుకు భారత్-చైనా మధ్య చర్చలు జరిగాయి. భారత్ తరుపున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్,చైనా తరుపున మేజర్ జనరల్ లిన్ లియూ చర్చలు జరిపారు. కానీ ఆ తర్వాత కూడా చైనా తీరు మారలేదు. దీంతో ఆ టెంట్ను కూల్చివేయాల్సిందిగా కల్నల్ సంతోష్ బాబు యూనిట్కు ఆదేశాలు వెళ్లాయి. దీంతో కల్నల్ సంతోష్ సైన్యంతో కలిసి ఆ టెంట్ను కూల్చివేయగా ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ తలెత్తి భౌతిక దాడులకు దారితీసింది. అయితే చైనా ఆ టెంట్ను ఎందుకు తొలగించలేదన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు.
మిలటరీ అధికారులు ఏమంటున్నారు...
సరిహద్దు ఘర్షణపై ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నప్పటికీ.. ఒక సీనియర్ మిలటరీ అధికారి మాట్లాడుతూ... 'ఘర్షణ సమయంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు కల్నల్ సంతోష్ బాబు ప్రయత్నించగా.. చైనా పీఏల్ఏ సైన్యం ఆయన్ను లక్ష్యంగా చేసుకున్నట్టు కనిపిస్తోంది.' అని తెలిపారు. చైనా చర్యల వెనుక పకడ్బందీ ప్లాన్ ఏమీ ఉండకపోవచ్చునని.. కానీ మన భూభాగం కోసం మనం గట్టిగా నిలబడుతామని వారు అంచనా వేయలేకపోయారని అన్నారు.
నిరాయుధులైన సైనికులను వేటాడి..
ఆఖరికి నిరాయుధులైన కొంతమంది భారత సైనికులు.. కొండ ప్రాంతం వైపు పారిపోగా... పీఎల్ఏ వారిని కూడా వెంబడించి వేటాడి హతమార్చినట్టు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. పీఎల్ఏ దాడుల నుంచి తప్పించుకునే క్రమంలో గాల్వన్ నదిలో దూకి చనిపోయిన సైనికులు కూడా ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం మరో 24 మంది సైనికులు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రుల్లో ఉన్నారని, మరో 110 మందికి చికిత్స అందించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Recommended Video
ఇరు దేశాల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు..
గాల్వన్ వ్యాలీలో ఇరు దేశాల మధ్య ఘర్షణకు దారితీసిన పరిస్థితులపై అటు చైనా గానీ ఇటు భారత్ గానీ ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే చైనీస్ మీడియా మాత్రం భారత సైన్యం రెచ్చగొట్టడం వల్లే చైనా ప్రతి దాడులకు పూనుకుందని పేర్కొంది. అంతేకాదు,గాల్వన్ వ్యాలీపై చైనా ఎప్పుడూ తమ సార్వభౌమత్వాన్ని కలిగి ఉంటుందని పేర్కొంది. జూన్ 15 నుంచి ఇప్పటివరకూ భారత సైన్యం రెండుసార్లు డీ-ఫాక్టో సరిహద్దును దాటి లోపలికి చొచ్చుకు వచ్చిందని ఆరోపించింది. భారత్ అక్రమ కార్యకలాపాలు,రెచ్చగొట్టుడు ధోరణి వల్లే ఇరు దేశాల సైనికుల మధ్య భౌతిక దాడులు చోటు చేసుకున్నాయని పేర్కొంది.