రైతులు మన మాట వినేలా లేరు... వాళ్లను తప్పుదోవ పట్టించాల్సిందే.. బీజేపీ కార్యకర్త వివాదాస్పద వ్యాఖ్యలు
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత రెండు నెలలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల స్థితి గతులను మార్చేందుకు ఈ చట్టాలు ఉపకరిస్తాయని కేంద్రం చెబుతుండగా... ఈ చట్టాలతో తమ పరిస్థితి మరింత దిగజారుతుందని రైతులు వాపోతున్నారు. ప్రతిపక్ష పార్టీలే రైతులను ఇలా తప్పుదోవ పట్టించాయని కేంద్రం మొదటినుంచి విమర్శిస్తోంది. రైతుల ఆందోళనలతో ఓ మెట్టు దిగిన కేంద్రం... ఏడాదిన్నర పాటు ఆ చట్టాలను పక్కనపెట్టేందుకు ముందుకొచ్చింది. కానీ రైతులు మాత్రం ఆ చట్టాలను రద్దు చేసేదాకా ఢిల్లీ సరిహద్దులను వీడేది లేదని తెగేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల ఉద్యమాన్ని ఎలా డీల్ చేయాలన్న విషయంపై బీజేపీ ప్రభుత్వం తర్జనభర్జన పడుతుంది.
ఇలాంటి తరుణంలో తాజాగా హర్యానాలోని గుర్గావ్లో జరిగిన పార్టీ సమావేశంలో ఓ బీజేపీ కార్యకర్త వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 'రైతులు మన మాట వినే పరిస్థితిలో లేరు... కాబట్టి వాళ్లను మనం తప్పుదోవ పట్టించాల్సిందే... ఇందుకోసం ఏమైనా సలహాలు,సూచనలు ఉంటే చెప్పండి.' అని బీజేపీ కార్యకర్త ఒకరు సమావేశానికి హాజరైన పార్టీ పెద్దలను కోరాడు. ఈ సమావేశంలో హర్యానా బీజేపీ అధ్యక్షుడు ఓపీ ధన్కర్,క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్,ఎంపీ బ్రిజేంద్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఈ వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేసి బీజేపీ అసలు స్వరూపం బయటపడిందని అన్నారు. 'రైతులను ఎలా మోసం చేయాలో చెప్పండని బీజేపీ కార్యకర్తలు మంత్రులు,నాయకులను అడుగుతున్నారు. ఇది బీజేపీ అసలు స్వరూపం.' అని సూర్జేవాలా పేర్కొన్నారు.
కాగా,కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గతేడాది నవంబర్ నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఘాజీపూర్,టిక్రీ,సింఘూ బోర్డర్లో రైతులు ఇప్పటికీ తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. జనవరి 26న రైతులు తలపెట్టిన ట్రాక్టర్ మార్చ్ హింసాత్మక రూపం దాల్చడంతో... రైతుల ఆందోళనలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రైతు ఉద్యమం నీరుగారుతుందని చాలామంది భావించారు. కానీ రైతులు మాత్రం పట్టు వదలకుండా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు.
भाजपा नेता पार्टी अध्यक्ष से केंद्रीय मंत्री व सांसदों के साथ बैठक में किसानों को “बहकाने के मंत्र” माँग रहा है। साफ़ कह रहा है कि आपकी बात सही है कि किसान समझेंगे नहीं बहकाने ही पड़ेंगे।
— Randeep Singh Surjewala (@rssurjewala) February 22, 2021
अन्नदाता व देश के प्रति भाजपा का असली चेहरा यही है।
चुल्लु भर पानी में डूब मरो।#Farmers pic.twitter.com/XXyHETRIBh












Click it and Unblock the Notifications