నీ కూతురిపై జరిగితే ఇలాగేనా: హోం మంత్రిపై ఈశ్వరప్ప
బెంగళూరు: కర్ణాటకలో అత్యాచారాల సంఘటనలు రాజకీయ పార్టీల మధ్య వాదవివాదాలకు, తీవ్ర వ్యాఖ్యలకు దారి తీస్తున్నాయి. పరస్పరం నిందించుకుంటూ రాజకీయాలను ఆసక్తికరంగా మారుస్తున్నారు. టిఆర్పి రేటింగ్ కోసం అత్యాచార కథనాలను ప్రసారం చేస్తూ బెంగళూరు ప్రతిష్టను మీడియా మంట కలుపుతోందని రాష్ట్ర హోం శాఖ మంత్రి కెజె జార్జ్ గురువారంనాడు విమర్సించారు.
అయితే, బిజెపి మాజీ అధ్యక్షుడు కెఎస్ ఈశ్వరప్ప వ్యక్తిగతమైన విమర్శలకు కూడా దిగారు. అత్యాచార ఘటనలు పెరగడాన్ని ఆయన మీడియా సమావేశంలో ఎత్తిచూపుతూ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. జార్జ్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ - "నీ కూతురిపై అత్యాచారం జరిగే నువ్వు ఎలా స్పందిస్తావు, చేతులు ముడుచుకుని కూర్చుంటావా?" అని అడిగారు.
హోం మంత్రి లేదా ముఖ్యమంత్రి తమ సొంత కూతుళ్లు అత్యాచారానికి గురైతే మరో విధంగా స్పందిస్తారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిందితులను ఇప్పటి వరకు కూడా అరెస్టు చేయలేదని, నిందితులను రక్షిస్తోందని, అందుకే ఈ బాధ్యతారహితమైన ప్రభుత్వంపై ఆ విధంగా మాట్లాడుతున్నానని ఈశ్వరప్ప అన్నారు. ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెసు కార్యకర్తలు బెంగళూరులో ఆందోళనకు దిగారు.
బాధ్యతలు నిర్వహణలో విఫలమైన కర్ణాటక హోం మంత్రి నిస్పృహతో ప్రతిస్పందిస్తున్నారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప అన్నారు.