టైమ్ టు ట్రాక్ : ఏ రాష్ట్రంలో ఎంతమంది యూకె రిటర్నీస్... తెలంగాణలో ఆ నంబర్ ఎంతంటే..
కొత్త రకం కరోనా వైరస్ బ్రిటన్ను వణికిస్తుండటంతో భారత్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే బ్రిటన్కు విమాన సర్వీసులను రద్దు చేసిన భారత్... ఇటీవలి యూకె నుంచి స్వదేశానికి వచ్చినవారిని గుర్తించే పనిలో నిమగ్నమైంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాల్లో యూకె రిటర్నీస్ లెక్కలను బయటకు తీస్తున్నాయి. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ సాయంతో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 22 వరకు యూకె నుంచి భారత్ వచ్చినవారి వివరాలను సేకరిస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు.
తెలంగాణకు 358 మంది...
గడిచిన వారం రోజుల్లో యూకె నుంచి తెలంగాణకు 358 మంది వచ్చినట్లు గుర్తించామని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. యూకె నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సోమవారం(డిసెంబర్ 21) యూకె నుంచి వచ్చిన వారికి కరోనా టెస్టులు చేశామని, గడిచిన వారం రోజుల్లో అక్కడినుంచి వచ్చినవారికి ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకూ తెలంగాణలో కొత్త వైరస్ కేసులు నమోదు కాలేదన్నారు. కొత్త రకం వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... విందులు,వినోదాలకు దూరంగా ఉండాలని సూచించారు. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఢిల్లీకి 7వేల మంది...
గడిచిన రెండు వారాల్లో యూకె నుంచి ఢిల్లీకి దాదాపు 7వేల మంది వచ్చినట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. ప్రస్తుతం వీరందరినీ ట్రాక్ చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలిపారు. యూకె నుంచి వచ్చినవారంతా తప్పనిసరిగా హోం ఐసోలేషన్లో ఉండాలని సూచించారు. యూకె రిటర్నీస్ అందరికీ కరోనా టెస్టులు నిర్వహిస్తామని చెప్పారు. సోమవారం (డిసెంబర్ 21) యూకె నుంచి ఢిల్లీ వచ్చిన ఐదుగురికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. బ్రిటన్ విమానాలపై సోమవారం అర్ధరాత్రి నుంచి నిషేధం విధించగా... రాత్రి 12గంటల కంటే ముందు వచ్చిన విమానంలోని ఐదుగురికి పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం వీరంతా క్వారెంటైన్లో ఉన్నట్లు సమాచారం.
చెన్నైకి 1088 మంది...
చెన్నైలో గత 10 రోజుల్లో దాదాపు 1088 మంది ప్రయాణికులు యూకె నుంచి రాష్ట్రానికి వచ్చినట్లు తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో ఒకరికి పాజిటివ్గా నిర్దారణ అయినట్లు తెలిపింది. అతని శాంపిల్స్ను పుణేలోని వైరాలజీ ల్యాబ్కు పంపిస్తున్నట్లు పేర్కొంది. యూకె రిటర్నీస్ వివరాలను ట్రాక్ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని తెలిపింది. విదేశాల నుంచి చెన్నై వచ్చే ప్రయాణికులకు 14 రోజుల క్వారెంటైన్ తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ముంబై,కోల్కతా,బెంగళూరులకు...
ఇటీవల యూకె నుంచి 591 మంది ప్రయాణికులు ముంబైకి వచ్చినట్లు మహారాష్ట్ర అధికారులు గుర్తించారు. వీరిలో 299 మంది వివిధ హోటళ్లలో క్వారెంటైన్లో ఉన్నారు. మరో 292 మందిని విమానాశ్రయంలోనే ఉంచినట్లు తెలుస్తోంది. ఎవరి సొంత ఖర్చులతో వారిని 7 రోజుల పాటు క్వారెంటైన్కు పంపిస్తామని అధికారులు తెలిపారు. బెంగళూరులో సోమవారం(డిసెంబర్ 21) ఒక్కరోజే దాదాపు 587 మంది యూకె నుంచి అక్కడి ఎయిర్పోర్టులో దిగారు. వీరిలో ఒకరికి పాజిటివ్గా నిర్దారణ అయింది. కోల్కతాలో ఇద్దరు యూకె రిటర్నీస్కు పాజిటివ్గా నిర్దారణ అయింది. అన్ని రాష్ట్రాలు యూకె రిటర్నీలను ట్రాక్ చేయడం,వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయడంపై ఫోకస్ చేశాయి.