ముఖేష్ అంబానీ ఇంటికి భద్రత పెంపు; అనుమానాస్పదంగా ఇద్దరు, క్యాబ్ డ్రైవర్ సమాచారంతో పోలీసులు అలెర్ట్
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి మరోమారు ప్రమాదం పొంచి ఉందని ఆయన నివాసం అయిన ఆంటిలియా వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖేష్ అంబానీ నివాసం ఆంటిలియాపై ఇద్దరు వ్యక్తులు ఆరా తీస్తున్నారనే సమాచారంతో ముంబై పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. భవనం చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజీని కూడా తనిఖీ చేస్తున్నామని వెల్లడించారు.
ముఖేష్ అంబానీకి మళ్ళీ భద్రత ముప్పు.. పోలీసులకు సమాచారం ఇచ్చిన ట్యాక్సీ డ్రైవర్
కొంతకాలం క్రితం ముఖేష్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కనిపించడంతో పోలీసులు షాక్ కు గురైన తర్వాత ఆ కేసు పలు కీలక మలుపులు తిరిగి ముంబై పోలీసులకు చుట్టుకున్న విషయం తెలిసిందే. ముఖేష్ అంబానీ నివాసం ఆంటిలియా అడ్రస్ కోసం ఇద్దరు వ్యక్తులు ఒక ట్యాక్సీ డ్రైవర్ ను సంప్రదించారని టాక్సీ డ్రైవర్ నుండి పోలీసులకు కాల్ వచ్చింది అని పోలీసులు ఈ రోజు మీడియాకు తెలిపారు. అడ్రస్ అడుగుతున్న ఇద్దరి చేతిలో పెద్ద బ్యాగ్ ఉందని వారు అనుమానాస్పదంగా ఉన్నారని ఆ డ్రైవర్ చెప్పారని ఆన్నారు.
అనుమానాస్పదంగా పెద్ద బ్యాగ్ తో ఉన్న వ్యక్తులు తనను కలిశారన్న క్యాబ్ డ్రైవర్
టాక్సీ డ్రైవర్ వెంటనే ముంబై పోలీసులకు సమాచారం ఇచ్చాడు అని పోలీసులు విలేకరులతో అన్నారు. డ్రైవర్ వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నామని, సీనియర్ అధికారి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల కోసం గాలింపు చేస్తున్నామని అన్నారు. ఫిబ్రవరిలో పేలుడు పదార్థాలతో నిండిన స్కార్పియో వాహనం ముఖేష్ అంబానీ ఇంటికి కొద్దీ మీటర్ల దూరంలో కనుగొనడంతో ముఖేష్ అంబానీ భద్రతపై ఆందోళన మొదలైంది. దేశంలోని అత్యంత ధనవంతుడికి భారీ భద్రతా భయం పట్టుకుంది.
గతంలో ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర అనుమానాస్పద స్కార్పియోలో జిలెటిన్ స్టిక్స్
ముంబై పోలీసులు ముఖేష్ అంబానీ కి ప్రమాదం పొంచి ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ భద్రతను పెంచారు. ఇప్పుడు మరోమారు ముఖేష్ అంబానీ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. గతంలో ముఖేశ్ అంబానీ ఇంటి సమీపంలో దొరికిన వాహనంలో 20 జిలెటిన్ స్టిక్స్తోపాటు ముఖేష్ అంబానీ, నీతా అంబానీలకు సంబంధించిన హెచ్చరిక లేఖ ఉన్నట్లు గుర్తించారు. వాటి వివరాలు బయటకు రాలేదు. చోరీకి గురైనట్లు గుర్తించిన కారు, కారు యజమాని, హత్యకు గురైన వ్యక్తిని ఆ తర్వాత గుర్తించారు. ఈ విషయంపై దర్యాప్తు ఇప్పటికీ కొనసాగుతోంది .
Recommended Video
మరోమారు ముఖేష్ అంబానీ ఇంటికి భద్రత పెంచిన ముంబై పోలీసులు
పోలీసు అధికారి సచిన్ వాజే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కోవడమే కాకుండా, కుట్రలో పాల్గొన్నారని తేలింది. కారు యజమాని మన్సుఖ్ హిరేన్ హత్యతో సంబంధం ఉన్నందుకు అధికారి సచిన్ వాజే ను తొలగించి అరెస్టు చేశారు. ఆపై ఈ కేసు అనేక కీలక మలుపులు తిరిగింది. ప్రస్తుతం ఈ కేసు ఇంకా కొనసాగుతూనే ఉన్న క్రమంలో, తాజాగా మరోమారు ముఖేష్ అంబానీపై కుట్ర జరుగుతుందని ఓ టాక్సీ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యి ముఖేష్ అంబానీ ఇంటికి భద్రతను పెంచారు. అయితే ట్యాక్సీ డ్రైవర్ చెప్పింది నిజమేనా? ముఖేష్ అంబానీ ఇంటి గురించి ఆరా తీసిన వారెవరు? వంటి వివరాలను ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకున్నారు.