కాపురానికి రాలేదని భార్య చెవి కోసిన భర్త
చెన్నై: భార్య కాపురానికి రావడం లేదని చెప్పడంతో ఆగ్రహించిన భర్త ఆమె చెవి కోసి పారిపోయిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... చెన్నైలోని ఆవడి సమీపంలో ఉన్న బంగారం పేట కరుమారియమ్మన్ కోవిల్ వీధిలో మారియప్పన్ (37) నివాసం ఉంటున్నాడు.
ఇతగాడు స్థానికంగా ఓ గోమాంసం దుకాణాన్ని నడుపుతున్నాడు. భార్య పేరు మాలతి (24). వీరికి ఇద్దరు పిల్లలు. సోమవారం సాయంత్రం దంపతులిద్దరి మధ్య చిన్నపాటి వివాదం జరిగింది. దీంతో మాలతి కోపంతో ఆమె తల్లి అములు పనిచేసే గార్డన్కు వెళ్లింది.
విషయం తెలుసుకున్న మారియప్పన్ అర్ధరాత్రి 12 గంటలకు గార్డెన్కు వెళ్లాడు. మాలతిని తనతో పాటు ఇంటికి రమ్మని పలిచాడు. అంతేకాదు బ్రతిమాలాడు. అయితే మాలతి అందుకు అంగీకరించలేదు. దీంతో మారియప్పన్ ఇంటికి ఎందుకు రావో చెప్పాలంటూ గొడవకు దిగాడు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ మరింత పెద్దదిగా మారింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మారియప్పన్ కత్తితో మాలతి కుడి చెవి కోసి పరారయ్యాడు. భర్త దాడిలో గాయపడిన మాలతిని ఆమె తల్లితో పాటు బంధువులు చికిత్స కోసం కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆవడి ట్యాంక్ ఫ్యాక్టరీలో తలదాచుకున్న మారియప్పన్ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అతడిని అంబత్తూరు కోర్టులో హాజరు పరచి పుళల్ జైలుకు తరలించారు.