హైద్రాబాద్ రెవెన్యూ టిదే, వైయస్ ఇవ్వాలన్నారు: జైరాం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పదేపదే చెప్పారని, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత హైదరాబాద్ ఆదాయం తెలంగాణకే ఉంటుందని కేంద్రమంత్రి, మంత్రుల బృందం (జివోఎం) సభ్యులు జైరామ్ రమేష్ గురువారం చెప్పారు. ఆయన హైదరాబాదులోని గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. విభజన విషయంలో అన్ని పార్టీలు నిలువునా చీలిపోయాయని చెప్పారు.
తెలంగాణ డిమాండ్ అరవయ్యేళ్లుగా ఉందన్నారు. 2004లో తెలంగాణపై కాంగ్రెసు పార్టీ హామీ ఇచ్చిందని, అన్ని పార్టీలను సంప్రదించాక 2009లో కేంద్రం నిర్ణయం తీసుకుందని, అన్ని దశలలో అందరితోను చర్చలు జరిపామన్నారు. వైయస్ ఈ విషయమై అసెంబ్లీలో కూడా ప్రకటన చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని వైయస్ పదేపదే కేంద్రానికి చెప్పారన్నారు. విభజన నిర్ణయం హడావుడిగా తీసుకున్నది కాదన్నారు.
పదేళ్లుగా సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. బిజెపిది లోకసభలో ఓ విధానం, రాజ్యసభలో మరో విధానం ఉందని ఆరోపించారు. 1969లో తెలంగాణ ఉద్యమం, 1970లలో జై ఆంధ్ర ఉద్యమం వచ్చిందని గుర్తు చేశారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెసు నిర్ణయం తీసుకుందన్నారు. 2013లో సిడబ్ల్యూసి తెలంగాణపై నిర్ణయం తీసుకుందన్నారు. అన్ని పార్టీలు నిర్ణయం చెప్పాకే కాంగ్రెసు నిర్ణయం తీసుకుందని, విభజన రాజ్యాంగవిరుద్ధం అనడం సరికాదన్నారు.
విభజన హడావుడి నిర్ణయం కాదన్నారు. ఆర్టికల్ 3ని బలపరుస్తూ సుప్రీం కోర్టు నాలుగుసార్లు తీర్పు చెప్పిందన్నారు. హైదరాబాద్ మీద వచ్చే రెవెన్యూ ఆదాయం తెలంగాణదే అన్నారు. హైదరాబాద్ ఆదాయం ఏదీ సీమాంధ్రకు వెళ్లదన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో ఆస్తుల పరిరక్షణ, శాంతిభద్రతలు గవర్నర్ పరిధిలో ఉంటాయని చెప్పారు. గవర్నర్ పరిధిలో ఉన్నప్పటికీ అంతిమ నిర్ణయం తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. ఎన్నికల ప్రయోజనాల కోసమే విభజన చేశారన్న వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని చెప్పారు.
రాష్ట్రాలు వేరైనా తెలుగు వారంతా ఒక్కటే అన్నారు. విద్యాసంస్థల్లో పదేళ్ల పాటు రిజర్వేషన్లు కొనసాగుతాయని చెప్పారు. బచావత్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విధానాల ప్రకారం నీటి పంపిణీ జరుగుతుందన్నారు. కృష్ణా, గోదావరి రివర్ బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు. గోదావరి రివర్ బోర్డు సీమాంధ్రలో, కృష్ణా రివర్ బోర్డు తెలంగాణలో ఉంటుందని, ఆ రెండు బోర్డులదే నీటి పంపిణీ బాధ్యత అన్నారు.