నేను డబ్బా మంత్రిని: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తన పనితీరుతోనే కాకుండా తన విలక్షణమైన ప్రసంగాలతో కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తాజాగా మధ్యప్రదేశ్లోని అశోక్ నగర్ జిల్లా చందేరీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన చేసిన కామెంట్స్ ప్రేక్షకులను ఆలోచింపజేయడమే కాకుండా కడుపుబ్బ నవ్వించాయి. ముఖ్యంగా మొబైల్ వాడకం వల్ల పెరుగుతున్న దూరాల గురించి మాట్లాడుతూ ఆయన తనను తాను డబ్బా మంత్రి అని పిలుచుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.
మొబైల్ ఫోన్ ఓ డబ్బా
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రసంగిస్తూ.. నేటి కాలంలో మొబైల్ ఫోన్లు అతిగా వాడకం వల్ల మనుషుల మధ్య సంబంధాలు ఎలా దెబ్బతింటున్నాయో వివరించారు. "నేను ఎక్కడ చూసినా వేదిక మీద ఉన్నవారు, కింద కూర్చున్న వారు, కారులో, విమానంలో.. ఇలా ఎక్కడ ఐదుగురు కూర్చున్నా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. అందరూ తమ తమ డబ్బా(మొబైల్)లలో బందీలైపోయారు. ఎవరి డబ్బాలో వారు మస్తుగా ఉంటున్నారు." అని వ్యాఖ్యానించారు.

భార్యాభర్తల మధ్య పెరిగిన దూరం
బంధాల గురించి ఆయన మరింత లోతుగా మాట్లాడుతూ.. "చివరికి భార్యాభర్తలు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. భర్త తన డబ్బాలో, భార్య తన డబ్బాలో మునిగిపోతున్నారు. ఇలాగైతే ఇక రిలేషన్స్ ఎలా ఏర్పడతాయి?" అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆయన నవ్వుతూ.. "నేను డబ్బా మంత్రిని(టెలికాం మంత్రిని). ఆ డబ్బాలను ఎంత ఎక్కువగా వాడితే నాకు అంత మంచిది. కానీ మానవ సంబంధాల దృష్ట్యా ఇది ఆందోళనకరం" అని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చమత్కరించారు.
జ్యోతిరాదిత్య సింధియా విన్నపం
ప్రస్తుతం మోదీ క్యాబినెట్లో టెలికాంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జ్యోతిరాదిత్య సింధియా, దేశంలో 5జీ నెట్వర్క్ విస్తరణకు, అనేక నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే సాంకేతికత ఎంత పెరిగినా.. కనీసం భోజనం చేసేటప్పుడైనా కుటుంబ సభ్యులందరూ మొబైళ్లను పక్కన పెట్టి ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జీవితంలో అన్నిటికంటే పెద్ద ఆస్తి 'బంధాలే' అని ఆయన గుర్తు చేశారు. మంత్రి హోదాలో ఉండి కూడా తన శాఖను 'డబ్బా' అని సంబోధిస్తూ, అందులోని ప్రతికూలతలను ధైర్యంగా చెప్పిన సింధియా శైలిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.












Click it and Unblock the Notifications