నేను అలహాబాద్ గూండాను: రాజ్థాక్రేకు కట్జూ సవాల్
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేనకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ సవాలు విసిరారు. పాక్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన 'యే దిల్ హై ముష్కిల్' చిత్రాన్ని విడుదల కాకుండా అడ్డుకుంటామని మహారాష్ట్ర నవ్నిర్మాణ సేన హెచ్చరించడం, దానికి నిర్మాత కరణ్ జోహార్ వివరణ ఇవ్వడం, విషయం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ దాకా వెళ్లడం తెలిసిందే.
ఈ అంశంపై తాజాగా కట్జూ వరుస ట్వీట్లతో స్పందించారు. కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కిన యే దిల్ హై ముష్కిల్లో పాక్ నటుడు ఫవద్ ఖాన్ ఉండటంతో ఆ సినిమా విడుదలను అడ్డుకుంటామని ఎంఎన్ఎస్ స్పష్టంచేసింది. దీనికి బాలీవుడ్లోని కొన్ని వర్గాలు మద్దతు తెలపగా.. మరికొన్ని వ్యతిరేకించాయి.
కట్జూ కూడా ఎంఎన్ఎస్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'ఎంఎన్ఎస్ కార్యకర్తలు అరేబియా సముద్రపు ఉప్పు నీరు తాగిన గూండాలు. త్రివేణీ సంగమం నీరు తాగిన నేను అలహాబాదీ గూండాని'. 'నిస్సహాయులైన నటీనటుల మీద మీ సత్తా చూపే బదులు.. నాతో కుస్తీకి రండి.. ఎవరు పెద్ద గూండానో ప్రపంచానికి తెలుస్తుంది' అంటూ జస్టిస్ కట్జూ ట్వీట్ చేశారు.
. So instead of showing your bravery on those helpless artists, come have a dangal with me, and let the world see who is a bigger goonda
— Markandey Katju (@mkatju) 19 October 2016
MNS people are goondas who have drunk the salt water of the Arabian Sea. I am an Allahabadi goonda, who has drunk the water of the Sangam
— Markandey Katju (@mkatju) 19 October 2016
జస్టిస్ కట్జూ తరచూ పలు అంశాలపై తన అభిప్రాయాలను సూటిగా, ఒకోసారి వ్యంగ్యంగా వ్యక్తపరుస్తూ ఉండడం తెలిసిందే. కట్జూతోపాటు మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా పాక్ నటుల నిషేధాన్ని వ్యతిరేకించాడు. 'ఒక్క ఎమ్మెల్యే ఉన్న ఎంఎన్ఎస్ పాఠాలు నేర్వడం లేదు.. థియేటర్లు ధ్వంసం చేస్తాం లాంటి బెదిరింపులతో వచ్చే ఎన్నికల్లో జీరో ఎమ్మెల్యే పార్టీగా మిగిలిపోతుంది' అని మంజ్రేకర్ ట్వీట్ చేశాడు.