'రాజకీయ పార్టీల్లో 'వన్ మ్యాన్ షోస్' నేను వ్యతిరేకం'
న్యూఢిల్లీ: భారత్లో మళ్లీ అత్యవసర పరిస్ధితి రావొచ్చంటూ తన వ్యాఖ్యలతో కలకలం సృష్టించిన బీజేపీ కురువృద్ధుడు, అగ్రనేత ఎల్కే అద్వానీ ఆ మాటలకు శుక్రవారం వివరణ ఇచ్చుకున్నారు. తన మాటలు ఏ ఒక్క వ్యక్తిపైనా కాదన్నారు. రాజకీయ పార్టీల్లో 'వన్ మ్యాన్ షోస్' లకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు.
రాజకీయనేతలంతా వాజపేయి తరహాలో ఉదాత్తంగా, ఆదర్శనీయంగా ఉండాలని హితవు పలికారు. దేశంలో మళ్లీ ఎమర్జెన్సీ విధించే అవకాశాలు లేకపోలేదంటూ వివాదాస్పద ప్రకటన చేసి కలకలం రేపిన అద్వానీ, ‘నా ప్రకటన ఎవరినీ ఉద్దేశించింది కాదు' అని స్పష్టం చేశారు.
తాను ఏ వ్యక్తిని ఉద్దేశించి ఆ ప్రకటన చేయలేదని, అన్ని రకాల నియంతృత్వ ధోరణులను తాను గర్హిస్తున్నానని తెలిపారు. అహంకారం వల్ల నియంతృత్వం పెరుగుతుందని, అది ఎంతమాత్రం ప్రజాస్వామ్యానికి వన్నే తీసుకురాదని పేర్కొన్నారు. దేశంలో రాజకీయ నాయకత్వంలో నియంతృత్వ పోకడలు మొదలయ్యాయా అన్న ప్రశ్నకు తాను మొదటినుంచీ 'వన్ మ్యాన్ షోస్' లకు వ్యతిరేకమని ఆజ్తక్ ఇంటర్వ్యూలో ఉద్ఘాటించారు.

తన హయాంలో వాజపేయి తలమానికమైన నాయకుడని, అయినప్పటికీ వాజపేయే భారతదేశం, భారతదేశమే వాజపేయి అని ఎవరూ అనడం తాను వినలేదని అద్వానీ తెలిపారు. అలాగే ఇండియా టుడేకు మరో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ‘అధికారాన్ని అందుకున్న ఎవరూ కూడా దాన్ని వదులుకోవడానికి సిద్ధపడరు' అని పేర్కొన్నారు.
అయితే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డవారికి ఓటర్లు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఎలాంటి అక్రమాలకైనా, దురహంకారానికైనా, అధికార దుర్వినియోగానికైనా గొడ్డలిపెట్టులాంటి సమాధానం చెప్పేది ఓటరేనని వెల్లడించారు.












Click it and Unblock the Notifications