నందిగ్రామ్లో గెలుస్తున్నా- బీజేపీతో జాగ్రత్త- అసద్, సిద్ధిఖీకి అవకాశం ఇవ్వొద్దన్న మమత
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో హోరాహోరీ పోరాడుతున్న మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్కు ఘనవిజయాన్ని అందించాలని ఓటర్లకు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇందులో విఫలమైతే బీజేపీ ధనబలంతో ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరలేపుతుందని మమత ఓటర్లను అప్రమత్తం చేశారు. నందిగ్రామ్లో మాత్రం తన విజయం ఖాయమన్నారు.
కూచ్బెహార్లోని దిన్హాటాలో ఎన్నికల ర్యారీలో పాల్గొన్న మమతా బెనర్జీ బీజేపీ నిప్పులు చెరిగారు. నందిగ్రామ్లో తాను గెలుస్తున్నానని, కానీ తాను మాత్రమే గెలిస్తే చాలదని, తృణమూల్ కాంగ్రెస్కు 200 సీట్లు ఇప్పించాలని ఓటర్లను మమత కోరారు. లేకపోతే బీజేపీ ధనబలంతో కుట్రలకు తెరలేపుతుందని మమత ఓటర్లకు తెలిపారు. ఈ ఎన్నికల్లో తృణమూల్ ఓట్లు చీలుస్తారని భావిస్తున్న ఎంఐఏం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ నేత అబ్బాస్ సిద్ధిఖీ పేరెత్తకుండానే ఓట్లను చీల్చే వారి గురించి అప్రమత్తంగా ఉండాలని మమత ఓటర్లను కోరారు.
ఓ నేత హైదరాబాద్ నుంచి వస్తారని, మరో నేత ఫుర్ఫురా షరీఫ్ నుంచి వస్తారని, వీరు మత ప్రాతిపదికన ఓట్లు చీల్చేందుకు ప్రయత్నిస్తారని.. వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని మమతా బెనర్జీ ఓటర్లకు సూచించారు. మైనార్టీలతో పాటు ఎస్సీ, ఎస్టీలను ఒకటే కోరుతున్నా.. మీ ఓట్లను చీల్చే వారిని అనుమతించొద్దంటూ మమత కోరారు. మరోపైపు ప్రధాని మోడీ గురించి ప్రస్తావిస్తూ ఆయన ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే బంగ్లాదేశ్ వెళ్లారని మమత ఆరోపించారు. కానీ బెంగాల్ ఓటర్లు అమయాకులు కాదని, ఆయన బంగ్లాదేశ్ ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసన్నారు.