అది తెలియదు, బలం కోసం: రజనీకాంత్పై పవన్కళ్యాణ్
హైదారబాద్: దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ను తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఆహ్వానించడం పైన జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు. రజనీకాంత్ను బీజేపీ ఆహ్వానిస్తున్న విషయం తనకు తెలియదని, అయితే, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కాబట్టి పార్టీకి బలం చేకూర్చే వారిని తీసుకుంటారని పవన్ అన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ మాటల మనిషి కాదని, చేతల మనిషి అని పవన్ కళ్యాణ్ గురువారం రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను కలిసిన అనంతరం చెప్పిన విషయం తెలిసిందే.
మోడీ, చంద్రబాబుల రెండు నెలల పాలనను చూసి ఓ అంచనాకు రాకూడదన్నారు. మోడీ చేతల్లో తన పాలనను చూపిస్తున్నారన్నారు. ఆకాశం నుండి చంద్రుణ్ని తీసుకు వస్తానని ఆయన చెప్పడం లేదని, ఆయన ప్రాక్టికల్ ప్రధాని అన్నారు. మార్పులు తీసుకు రావడానికి కొంత సమయం పడుతుందని అన్నారు.
కాగా, త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలిసి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మజ్లిస్, తెలంగాణ రాష్ట్ర సమితిలు కూటమిగా పోటీ చేయనున్నాయి. కాంగ్రెసు పార్టీ మాత్రం ఒంటరిగా పోటీ చేసే అవకాశముంది.