అన్ని విషయాలూ తెలుసు: సీఎం ఉద్ధవ్ థాక్రే, శివసేనకు నారాయణ్ రాణే వార్నింగ్
ముంబై: బెయిల్పై విడుదలైన మూడు రోజులకు కేంద్రమంత్రి నారాయణ్ రాణే మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, శివసేన నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శివసేన పార్టీతోపాటు అందులోని నాయకుల గురించి చాలా విషయాలు తనకు తెలుసునని, ఒక్కోదాన్ని బయటకు తీస్తానంటూ హెచ్చరించారు. జన్ ఆశీర్వాద్ యాత్రలో భాగంగా రత్నగిరి జిల్లాలో పర్యటిస్తున్న కేంద్రమంత్రి నారాయణ్ రాణే.. శివసేన నాయకులపై విరుచుకుపడ్డారు.
'శివసేనతో నేను 39ఏళ్లపాటు పనిచేశాను. నాకు చాలా విషయాలు తెలుసు. సొంత సోదరుడి భార్యపైనే యాసిడ్ విసరాలని ఎవరు ఎవరితో చెప్పారో నాకు తెలుసు. అదే సంస్కారం?' అని కేంద్రమంత్రి నారాయణ రాణే వ్యాఖ్యలు చేశారు. సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే లక్ష్యంగా చేసుకుని విమర్శలను గుప్పించారు కేంద్రమంత్రి రాణే.

కేంద్రమంత్రిని అరెస్ట్ చేయడం ద్వారా వారు సాధించిందేంటి? అని ప్రశ్నించారు. వారికి సంబంధించిన ఒక్కో కేసును బయటకు తీసుకువస్తానని హెచ్చరించారు. శివసేన పార్టీకి చెందిన యువజన విభాగం నేత సర్దేశాయ్ తన ఇంటిముందుకే వచ్చి బెదిరించాడని, మరోసారి వస్తే మాత్రం తిరిగి వెళ్లలేడని కేంద్రమంత్రి ఘాటుగా హెచ్చరించారు. మరోవైపు, శివసేన నేత సంజయ్ రౌత్ కూడా రాణేపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీలోకి వెళ్లి ఇలా తయారయ్యారని దుయ్యబట్టారు.
కాగా, తన రాజకీయ ప్రస్థానాన్ని శివసేనతోనే ఆరంభించిన నారాయణ్ రాణే.. శివసేనలో కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి పదవిని చేపట్టే స్థాయికి ఎదిగారు. 1999లో మహారాష్ట్ర సీఎంగా కూడా బాధ్యతలు చేపట్టారు. కొన్ని నెలలపాటు ఆయన సీఎంగా కొనసాగారు. ఆ తర్వాత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని 2005లో ఆయనను పార్టీ నుంచి శివసేన తొలగించింది.
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన నారాయణ్.. 2017 అక్టోబర్లో మహారాష్ట్ర స్వాభిమాన్ పక్షా పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. 2018లో బీజేపీకి మద్దతు ప్రకటించి, ఆ పార్టీ తరపున రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఇక 2019లో ఆయన తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ప్రస్తుతం కేంద్రమంత్రిగా కొనసాగుతున్న నారాయణ్ రాణే.. ఇటీవల సీఎం ఉద్ధవ్ థాక్రే చెంప పగలగొడతానంటూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అరెస్టయ్యారు. ఆ తర్వాత కోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యారు. ఆగస్గు 15న ప్రసంగంలో భారతదేశానికి స్వాతంత్ర్యం ఎప్పడు వచ్చిందనే విషయంపై తడబడ్డారు ఉద్దవ్ థాక్రే. అయితే, తాను ఒకవేళ అక్కడే ఉండివుంటే అతని చెంప పగలగొట్టేవాడినని నారాయణ్ రాణే వ్యాఖ్యానించారు. దీంతో మహారాష్ట్రలో శివసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బీజేపీ, శివసేన కార్యకర్తల మధ్య పలు చోట్ల ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications