చో ను చాల మిస్ అయ్యాను, జయలలిత, తమిళనాడుకు: సూపర్ స్టార్ రజనీకాంత్!
చెన్నై: ప్రజా ప్రభుత్వం విఫలం అయితే కచ్చితంగా రాజకీయ రంగప్రవేశం చెయ్యాలని సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. అయితే తన రాజకీయ రంగప్రవేశం జరిగే సమయంలో తన చిరుకాల మిత్రుడు, సహ నటుడు చో రామస్వామి దూరం అయ్యారని సూపర్ స్టార్ రజనీకాంత్ విచారం వ్యక్తం చేశారు.
చో రామస్వామి అంటే
తమిళనాడులో చో రామస్వామికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. రజకీయ విశ్లేషకుడిగా, సినీ రచయిత, నటుడు, దర్శకుడు, మాటల రచయిత, అంతకంటే గొప్ప పాత్రికేయుడిగా తమిళనాడు ప్రజల గుండెల్లో చో రామస్వామి చిరస్థాయిగా నిలిచిపోయారు.
అమ్మ జయలలిత!
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు రాజకీయ సలహాదారుడిగా చో రామస్వామి పని చేశారు. చో రామస్వామి మాట అన్నా, ఆయన సూచనలు అన్నా జయలలిత ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. చో రామస్వామి ఒక్క మాట చెప్పారంటే అందులో ఎంతో విలువైన అర్థం ఉంటుందని జయలలిత ఎన్నో సార్లు బహిరంగంగా చెప్పారు.
అమ్మ మరుసటి రోజు!
2016 డిసెంబర్ 5వ తేదీ రాత్రి పొద్దుపోయిన తరువాత జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మరణించిన విషయం తెలిసిందే. కొన్ని గంటల వ్యవదిలో డిసెంబర్ 6వ తేదీన వేకువ జామున అదే అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చో రామస్వామి మరణించారు.
జయలలిత విషయంలో?
తమిళ సినీరంగంలో, పాత్రికేయుడిగా చో రామస్వామి ఎంతో కృషి చేశారని రజనీకాంత్ గుర్తు చేశారు. .అంతే కాకుండా జయలలితకు రాజకీయ సలహాదారుడిగా చో రామస్వామి చాల మంచి చేశారని రజనీకాంత్ అన్నారు.
ఎంతో మందికి ఆదర్శం!
తమిళనాడులో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన చో రామస్వామి తాను రాజకీయ రంగప్రవేశం చేసే సమయంలో లేకపోవడం తనకు ఎంతోతీరని లోటు అని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. ఆయన ఈ రోజు తమ ముందు ఉంటే ఎంతో ధైర్యంగా ఉండేదని రజనీకాంత్ చెప్పారు.
ఆయన సలహాలు
చో రామస్వామి ఈ రోజు ప్రాణాలతో ఉంటే తనకు రాజకీయంగా ఎంతో ఉపయోగపడేవారని, ఆయన సలహాలు, సూచనలు ఉంటే ఈ రోజు నేను ధైర్యంగా ముందడుగు వేసి రాజకీయాలు చేసేవాడినని సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పారు.
ఆయన ఆశీస్సులు ఉంటాయి!
చో రామస్వామి మన మధ్య లేకపోయినా తనకు ఎప్పుడు ఆయన ఆశీస్సులు ఉంటాయని, గతంలో ఆయన సూచించిన సలహాలు, సూచనలు తనకు ఇప్పటికీ గుర్తు ఉన్నాయని, ఆయన సలహామేరకే తాను ప్రజాసేవ చేస్తానని సూపర్ స్టార్ రజనీకాంత్ వివరించారు.