ప్రధాని మోడీకి సెల్యూట్ చేస్తున్నా: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: పాక్ అక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో సర్జికల్ దాడుల విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చూపిన మనోబలానికి తాను సెల్యూట్ చేస్తున్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి, అమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.
పాక్ కు భారత్ ఆర్మీ బుద్ది చెప్పిన తరువాత ప్రధాని నరేంద్ర మోడీకి దేశంలోని అన్ని వర్గాల నుంచి, ప్రత్యర్థి రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తున్నదని. నిత్యం ఎదో ఒక విధంగా ప్రధానిని టార్గెట్ చేసిన వారు సైతం ఇప్పుడు మోడీని ప్రశంసిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర ప్రభుత్వంతో నిత్యం విభేదించే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఆ జాబితాలోకి చేరిపోయారు. పాక్ అక్రమిత కాశ్మీర్ లో చొరబడి పాకిస్థాన్ ఉగ్రవాదులను అంతం చెయ్యడంలో భారత సైన్యం విజయం సాధించిందని కొనియాడారు.

సర్జికల్ దాడులను తాను పూర్తిగా సమర్థిస్తున్నానని అన్నారు. సర్జికల్ దాడులపై పాకిస్థాన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎండగట్టాలని ప్రధాని నరేంద్ర మోడీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
జమ్మూ కాశ్మీర్ లోని ఊరీ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడులు చేసిన విషయం తెలిసిందే.
దాడి తరువాత పాక్ ఉగ్రవాదులకు భారత సైన్యం గట్టిబుద్ది చెప్పింది. ప్రధాని నరేంద్ర మోడీ చూపించిన తెగువకు తాను పూర్తి మద్దతు ఇస్తానని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. ఆ జాబితాలో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ చేరారు.












Click it and Unblock the Notifications