రాజకీయాల్లోకి రాను: సచిన్, మోడీకి ప్రతిపాదనలు
లండన్: ప్రత్యక్ష రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశాడు. దేశంలో క్రీడాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెప్పాడు. ఇప్పటికే ఈ విషయానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రధాని నరేంద్ర మోడీకి అందచేశానని పేర్కొన్నాడు. తన ఆటోబయోగ్రఫీ ‘ప్లేయింగ్ ఇట్ మై వే' పుస్తకాన్ని శుక్రవారం లండన్లోని ఇక్కడి లార్డ్స్ మైదానంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుడిగా తాను దేశంలో క్రీడాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపాడు. పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పటికీ తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఏదీ లేదని అన్నాడు. త్వరలోనే మోడీని కలిసి తన ఆలోచనలను వివరిస్తానన్నాడు.
విండీస్ తీరు క్రికెట్కు మంచిది కాదు
భారత పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని స్వదేశానికి వెళ్లిన వెస్టిండీస్ తీరు గర్హనీయమని సచిన్ అన్నాడు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం క్రికెట్కు మంచిది కాదని వ్యాఖ్యానించాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, తాను రిటైరైనందువల్ల క్రికెట్ను దగ్గరగా పరిశీలించడం లేదని వ్యాఖ్యానించాడు. పత్రిల్లో వచ్చిన వార్తలనే చదివానని, నిజానికి ఏం జరిగిందో తనకు తెలియని చెప్పాడు. పూర్తి సమాచారం లేకుండా లోతుగా వ్యాఖ్యానించడం సమంజసం కాదన్నాడు.
టెస్టులే కీలకం
క్రికెట్లో టెస్టులే కీలకమని, అవే ఉన్నత స్థానాన్ని ఆక్రమిస్తాయని సచిన్ స్పష్టం చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ వల్ల ఆటగాళ్లు తమ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించే అవకాశం లభించిందని సచిన్ అంగీకరించాడు. అయితే, టెస్టుల స్థానాన్ని మరో ఫార్మెట్ భర్తీ చేయలేదని అన్నాడు. ఏ ఫార్మెట్ గొప్పతనం దానిదని, టెస్టు క్రికెట్తోనే క్రికెటర్లకు పూర్తి సంతృప్తి లభిస్తుందని అన్నాడు.
డిఆర్ఎస్పై ఒకే విధానం అవసరం
ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అప్పీల్ చేసుకునే అవకాశాన్నిచ్చే డిసిషన్ రివ్యూ విధానం (డిఆర్ఎస్)ను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న సచిన్ మరోసారి తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాడు. ప్రపంచ మంతా ఒకే విధానాన్ని అనుసరించాలని సూచించాడు. ఒక్కో దేశంలో ఒక్కో విధానంలో డిఆర్ఎస్ను అనుసరించడం వల్ల సమస్యలు తలెత్తుతాయని చెప్పాడు.