చలింపోయా, ఇప్పుడు ఊరట పొందా: తీర్పుపై మోడీ
హైదరాబాద్: తనను కమ్ముకున్న అసత్య మేఘాలు ఎట్టకేలకు తొలగిపోయాయని, ఆవేదనాభరిత ప్రయాణం నుంచి విముక్తుడినయ్యానని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.తాను కూడా అల్లర్ల బాధితుడేనని, తనకు ఎంతో ఇష్టమైనవారిని కోల్పోయానని, నాటి ఒక్కో ఘటన తన గుండెలను బద్దలు చేసిందని ఆయన అన్నారు. తాజా తీర్పును వ్యక్తిగత విజయంగా పరిగణించడం లేదు. ఎన్నడూ తనలో విద్వేష భావాలను రానివ్వద్దని దేవుడిని సదా కోరుకుంటాననని ఆయన తన బ్లాగులో వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత కూడా నాపై రాళ్లు పడుతూనే ఉండటం తనను మరింత బాధ పెట్టిందని, అన్నిటినీ బాధతోనే భరించానని ఆయన చెప్పారు. నాటి గాయాలను విస్మరించే ప్రయత్నం చేస్తున్న గుజరాతీ ప్రజలను సైతం కొందరు మనసులేని వాళ్లు వదల్లేదని, నిత్యం తమ మాటలతో ఆ గాయాలను రేపుతూనే ఉన్నారని ఆయన అన్నారు. గోధ్రా రైలు దుర్ఘటన నాటి నుంచే శాంతి కోసం పదే పదే విజ్ఞప్తి చేశానని అన్నారు.

అమాయకుల ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశానని, అల్లర్లు జరిగిన వెంటనే దేశంలో ఏ ప్రభుత్వమూ స్పందించని రీతిలో గుజరాత్ ప్రభుత్వం చురుగ్గా స్పందించిందని, అల్లర్లను అణ చివేయడంతో పాటు బాధితులకు తగిన సాయం అందించిందని ఆయన చెప్పారు.
దాదాపు వెయ్యి మందిని పొట్టనబెట్టుకున్న 2002 గుజరాత్ అల్లర్లపై ఇంతవరకు ఎలాంటి స్పందన వ్యక్తం చేయని మోడీ తొలిసారి మనసు విప్పారు. అహ్మదాబాద్ కోర్టు తాజాగా ఆయనకు క్లీన్చిట్ ఇచ్చిన నేపథ్యంలో తన బ్లాగులో తన అంతరంగాన్ని విప్పారు. తనకు విముక్తి లభించిందని, ప్రశాంతంగా ఉందని, ఈ సమయంలో నా మనసులో సుదీర్ఘకాలంగా గూడుకట్టుకుపోయిన ఆవేదనను అశేష భారతావనితో పంచుకోవాలని నా మనసు పరితపిస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications